Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లా కనెక్షన్కంటూ రూ.3000 టోకరా
- నారాయణపేటలో వర్కింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం
- అధికారులతో కుమ్మక్కు
- విజిలెన్స్ విచారణకు ఆదేశం
- పలువురికి నోటీసులు, క్రిమినల్ కేసులు
- సర్కారు లక్ష్యానికి తూట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ లక్ష్యానికి క్షేత్రస్థాయిలో అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రజలందరికీ ఉచితంగా నీటిని అందిస్తామన్న ప్రభుత్వ హామీని అపహాస్యం చేస్తున్నారు. తద్వారా సర్కారు ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు కావడానికి కారణమవుతున్నారు. ఇందుకు మిషన్ భగీరథలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలే సాక్షం. కాంట్రాక్టర్లు, వారి ఏజెన్సీలు స్థానిక అధికారులతో కుమ్మక్కయి పేదలను ఆర్థికదోపిడి చేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలను టార్గెట్ చేసి అక్రమ వసూళ్ల దందాకు పాల్పడ్డాయి. నల్లా కనెక్షన్ కోసమంటూ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు గుంచి పేదలకు టోపీ పెట్టాయి. ఈ సంగతి రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా ఉట్కూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో స్థానిక కాంట్రాక్టర్లు, వర్కింగ్ ఏజెన్సీలు పేద ప్రజల నుంచి భగీరథ నల్లా కనెక్షన్ పేర రూ. 2500 నుంచి రూ. 3000 వరకు వసూలు చేసిన వైనం బయటపడింది. అంతేగాక ప్రతినెలా నీళ్లు సరఫరా చేసేందుకుగాను ప్రత్యేక టారీఫ్ను సైతం సొంతంగానే నిర్ణయించారు. దీనికి రూ. 40 వసూలు చేసినట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. ఈ అక్రమ వ్యవహారాలకు అధికార పార్టీకి చెందిన స్థానిక కాంట్రాక్టర్లరే కారణమని తెలిసింది. అంతేగాక స్థానిక ఎగ్జిక్యూటీవ్ అధికారులతో మిలాఖత్ అయి వ్యవహారాన్ని బహిరంగంగానే కానించారు. ఇదంతా తెలిసినా అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. ఇటీవల కొందరు ఈ వ్యవహారంపై రాష్ట్ర మిషన్ భగీరథ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అసలు గుట్టు బయటపడింది దీనిపై ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. కృపాకర్రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విజిలెన్స్ అధికార బృందం గత వారం రోజుల నుంచి ఉట్కూరులో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. కొంత మంది పేదల దగ్గర భగీరథ నల్లా కనెక్షన్ కోసం డబ్బులు అక్రమంగా తీసుకున్నట్టుగా విజిలెన్స్ టీమ్ ధృవీకరించింది. ఉట్కూర్ మేజర్ గ్రామపంచాయతీలోని 135 మంది దగ్గర రూ. 2000, నల్లా బిల్లు కోసమంటూ రూ.40 వసూలు చేశారు. అలాగే అదే పంచాయతీలోని న్యూచెక్పోస్ట్ కాలనీలో మరో ఆరుగురి వద్ద రూ. 3000 తీసుకున్నారు. ఇది స్థానిక కాంట్రాక్టర్కు చెందిన వర్కింగ్ ఏజెన్సీ చేసిన పనేనని సమాచారం. పేదల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు మిషన్ భగీరథ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందుకు బాధ్యులైన సంబంధిత సర్పంచ్తోపాటు కార్యదర్శికి నోటీసులు ఇచ్చి, మిగతా వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్టు భగీరథ రాష్ట్ర కార్యాలయర ఉన్నతాధికారులు చెప్పారు. భగీరథ తాగునీటిని రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలనేది ప్రభుత్వ విధానమనీ, ఎక్కడా కనెక్షన్ల కోసం డబ్బులు వసూలు చేయలేదని ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్రెడ్డి తెలిపారు. ఎవరైనా మార్గదర్శకాలకు విరుద్ధంగా డబ్బులు అడిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాత స్థానిక అధికారుల పాత్ర ఉంటే, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.