Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజ మార్పు కోసం లక్ష్మి కృషి
- ప్రాంతం, మతం పేరుతో మనుగడ అసాధ్యం
- పొంచిఉన్న ఆహార సంక్షోభం
- ధనిక దేశాలకు టీకా అమ్మకాలు :సీపీఐ(ఎం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శులు తమ్మినేని, మధు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
సమాజంలో మార్క్సిజంతోనే సమానత్వం సాధ్యమౌతుందని సీపీఐ(ఎం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పెనుమల్లి మధు అన్నారు. శనివారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బాల్రెడ్డి అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పనిచేసిన లక్ష్మి సంస్మరణ సభలో వారు పాల్గొని మాట్లాడారు. లక్ష్మి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వంటలు చేసి అనేకమందికి సేవలందించిందని గుర్తుచేశారు. ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులెదురైనా సమాజ మార్పు కోసం పనిచేస్తున్న ఉద్యమకారులకు వెన్నంటి ఉండటమే ఆమె నిబద్ధతకు నిదర్శనమన్నారు. నక్సలైట్ల దాడులను తట్టుకుంటూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన బొల్లారం గ్రామ ప్రజలకు, లక్ష్మి కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్ష్మి ఏ ఆశయం కోసమైతే పని చేసిందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉద్యమాలు నిర్మాణం చేయడమే ఆమెకిచ్చే నిజమైన నివాళి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతతత్వం, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. అప్పడాలు తినడం, చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, ఆవు మూత్రం తాగడం వంటి పనులు చేస్తే కరోనా కట్టడి కాదనీ, సైన్స్ ద్వారానే కరోనాను నియంత్రించవచ్చని ప్రపంచంలో చైనా, భారత్లో కేరళ నిరూపించాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా, ఆర్థిక సంక్షోభం రెండు ప్రధాన విపత్తులు మానవాళి ముందున్నాయన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది కరోనా బాధితులు చనిపోగా, అనేకమంది ఈ వ్యాధి బారిన పడి రూ. కోట్లలో అప్పులపాలయ్యారని తెలిపారు. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. ఇలాంటి సమయంలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు కరోనా టీకా ఇవ్వకుండా మోడీ సర్కార్ ధనిక దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూముకుంట, బొల్లారం, వీపనగండ్ల గ్రామాల ప్రజలు స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి వారిపై తిరుగుబాటు చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. ఈ ప్రాంత ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం గాక అనేక చోట్ల ఉద్యమాలకు బీజం వేసినట్టైందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరువు కాటకాలు పెరిగి నిత్యం అనేకమంది ఆకలిచావులు చస్తుంటే అంబలి కేంద్రాలు నడిపి అనేకమంది ఆకలి తీర్చిన ఘనత ఎర్ర జెండాకు ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ఫలితంగానే ఈ ప్రాంతంలో గుమ్మడానికి వచ్చిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆకలి నివారణ కోసం పింఛన్లను మంజూరు చేశారనీ, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి ఇక్కడే బీజాలు పడ్డాయని గుర్తుచేశారు. అంతకుముందు వారితో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజే నర్సింగ్ రావు, జాన్ వెస్లీ, నవతెలం గాణ దినపత్రిక సీజీఎం ప్రభాకర్, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ధర్మానాయక్, సీపీఐ(ఎం) వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల కార్యదర్శులు ఎండీ. జబ్బార్, ఎ.రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా నాయకులు నాగిరెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులు లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.