Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వాన్ని బొందపెడతం
- కేసీఆర్ రెండు తలల పాము : మాజీ ఎమ్మెల్యే జూలకంటి
- నల్లగొండలో నాగళ్లతో నిరసన
- రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు, ప్రదర్శనలు
నవతెలంగాణ - విలేకరులు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయకపోతే మోడీ ప్రభుత్వాన్ని బొంద పెడతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటం 100 రోజులు పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపుమేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు, ప్రదర్శనలు జరిగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో 100 నాగళ్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దొడ్డి కొమురయ్య భవన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన గడియారం సెంటర్ వరకూ సాగింది. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 100 రోజులుగా ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి మాట్లాడుతూ.. వంద రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను 11 సార్లు చర్చలకు పిలిచినా డిమాండ్లు ఒప్పుకోలేదని తెలిపారు. మూడు నల్ల చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మానవహారం నిర్వహించారు. మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర మానవహారం నిర్వహించారు. అనంతరం సీఐటియూ జిల్లా కార్యదర్శి రాజయ్య, రైతుసంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజులు మాట్లాడుతూ.. కార్పొరేట్లకు దేశీయ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టే రాజ్యాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. చట్టాలను రద్దుచేయకుంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధతం అవుతాయని తెలిపారు.