Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనవళ్లతో ఆడుకుంటున్నా రికార్డుల్లో బ్యాచిలర్లే!
- ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో విచిత్రాలు
- కేవైసీ అప్డేట్ చేసుకోవాలని యాజమాన్యం ఉత్తర్వులు
- నిలిచిపోయిన రిటైర్మెంట్ బెనిఫిట్లు, రుణాలు
- కష్టాల్లో ఉద్యోగులు
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
అవును...ఆర్టీసీలో పెళ్ళైన వృద్ధ 'బ్రహ్మచారులు' ఉన్నారు. వాళ్లంతా రిటైర్మెంట్కు దగ్గరైన వారు.. కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లకు కూడా పెండ్లిండ్లు చేసేసిన 'బ్రహ్మచారులు'. చిత్రంగా ఉన్నా...ఇదే నిజం. ఈపీఎఫ్ఓ రికార్డులు దీన్నే ధ్రువీకరిస్తున్నాయి. ఆర్టీసీ కొలువులో చేరే నాటికే పెండ్లిండ్లు అయిన వారు కూడా ఈ వెబ్సైట్లో బ్యాచిలర్స్గానే నమోదై ఉన్నారు. నామినీలు లేరు. ఆర్టీసీ రికార్డుల్లో మాత్రం ఉద్యోగుల వివరాలన్నీ ఆప్డేట్ అయి ఉన్నాయి. ఆ సమాచారం ఈపీఎఫ్ఓ లో అప్డేట్ కాలేదు. దీనివల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందట్లేదు. విధి నిర్వహణలో మరణిస్తే...నామినీ పేరు లేదంటూ ఈపీఎఫ్ఓ ఇచ్చే పెన్షన్ సహా అన్ని బెనిఫిట్స్ను నిలి పివేస్తున్నారు. అలాగే ఆర్టీసీ రికార్డుల్లో ఉన్న పూర్తి పేర్లు, ఈపీఎఫ్ఓ లో షార్ట్కట్గా కనిపిస్తున్నాయి. బెనిఫిట్స్ అందించే సమయంలో పేర్లు కలవలేదంటూ కొర్రీలు పెడుతున్నారు. రెండేండ్ల క్రితం ఆర్టీసీ కార్మికుల 55 రోజుల సమ్మె సమయంలో మరణించిన వారి కుటుంబసభ్యుల్లో కొందరికి ఇప్పటికీ బెనిఫిట్స్ పూర్తిస్థాయిలో అందలేదంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతున్నది. సంస్థలో దాదాపు 30-35 ఏండ్లు సర్వీస్ చేసిన తర్వాత, రిటైర్మెంట్ సమయంలో కానీ ఈ విషయాలు వెల్లడికావట్లేదు. ఈపీఎఫ్ఓకు యాజమాన్యం సకాలంలో వాయిదాలు చెల్లించట్లేదు. పైపెచ్చు ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేసిన సొమ్మును కూడా సొంతానికి వాడుకుంటున్నారు. ఈపీఎఫ్ఓ సభ్యుల పోర్టల్లో కేవైసీ అప్డేట్ చేయించుకోవాలని ఇటీవల యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది (లెటర్ నెంబర్ డిప్యూటీ సూపరింటెండెంట్ (ఎఫ్) జనరల్ (ఎస్) 2020-21 తేదీ.08.10.2020) దీనిప్రకారం మూడు నెలల్లో కేవైసీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కానీ డిపోస్థాయిలో చేయాల్సిన పనుల్ని, బయట మీ సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి చేసుకొచ్చుకోమని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల డబ్బుతో పాటు సెలవులు పెట్టుకోవాల్సి వస్తున్నదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.1,210 కోట్లు బాకీ
ఉద్యోగి భవిష్యనిధి (పీఎఫ్)కి యాజమాన్యం రూ.1,210 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన మొత్తం కూడా యాజమాన్యం తన వద్దే ఉంచేసుకున్నది. తక్షణం బకాయిలు చెల్లించకుంటే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పీఎఫ్ రీజినల్ కమిషనర్ కార్యాలయం వారం రోజుల క్రితం హెచ్చరించింది. దీనితో తమ భవిష్యత్పై ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతున్నది. ఆడపిల్లల పెండ్లిండ్లు, సొంత ఇండ్ల నిర్మాణం, కొనుగోళ్ళ కోసం ఈపీఎఫ్ఓ నుంచి డబ్బు డ్రా చేసుకొనేందుకు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి. ఫలితంగా కార్మికులు అప్పులపాలవుతున్నారు. ఇప్పటికి పలుమార్లు పీఎఫ్ అధికారులు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అలాంటి సమయంలో ఎంతో కొంత కట్టి, గట్టెక్కడం మినహా సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపట్లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఈడీఎల్ఐఎస్దీ అదే పరిస్థితి
ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం (ఈడీఎల్ఐఎస్)...యాజమాన్యం మాత్రమే చెల్లించే డబ్బుతో నిర్వహించే ఇన్సూరెన్స్ స్కీం ఇది. 1976లో ప్రారంభమైంది. విధినిర్వహణలో ఉద్యోగి మరణిస్తే, డెత్ సర్టిఫికెట్ సమర్పించిన 30 రోజుల్లో కుటుంబసభ్యులకు బెనిఫిట్స్ను చెల్లించాలి. 2020లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో కనీస మొత్తం రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.7 లక్షల వరకు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. 30 రోజులు దాటితే 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏడాది క్రితం చనిపోయిన వందమందికి పైగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు.
పెన్షన్ లేదు...
పీఎఫ్ చట్టం ప్రకారం 58 ఏండ్లు పూర్తయితే పెన్షన్ తీసుకోవచ్చు. 2020 మార్చి నుంచి...అంటే ఏడాది కాలంగా పీఎఫ్కు చెల్లించాల్సిన డబ్బుల్ని యాజమాన్యం చెల్లించని కారణంగా క్లెయిమ్స్ పరిష్కారం కాలేదు. ఇప్పటికీ రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ మంజూరీ ఆలస్యమవుతున్నది.
ఆ డబ్బు ఏమైంది?
పెన్షన్ హయ్యర్ ఆప్షన్ కోసం ఆర్టీసీ కార్మికుల్లో ఒక్కొక్కరి వేతనం నుంచి ప్రతినెలా డబ్బులు వసూలు చేశారు. అలాంటి సొమ్ము ఒక్కో కార్మికుడి నుంచి దాదాపు రూ.1.60 లక్షలు వరకూ ఉంది. కానీ ఉమ్మడి ఆర్టీసీలో 36వేల మంది కార్మికులకు ఈ వెసులుబాటు లేదంటూ హైయ్యర్ ఆప్షన్ తిరస్కరించారు. వారి నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లిస్తామని 2015లో కార్మికులకు లెటర్లు ఇచ్చారు. కానీ ఇప్పుడా సొమ్ము ఏమైందనే ప్రశ్నకు యాజమాన్యం సమాధానం చెప్పట్లేదు. కార్మికుడి పీఎఫ్ ఖాతాలో ఆ సొమ్ము ఉన్నట్టు చూపట్లేదు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అస్తవ్యస్తం...
ఆర్టీసీలో వ్యవస్థల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కార్మికుల జీతాల్లోంచి వసూలు చేస్తున్న డబ్బులు ఏమవుతున్నాయో తెలియట్లేదు. యాజమాన్యం దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వట్లేదు. పలుమార్లు లేఖలు రాసాం. స్పందన లేదు. రిటైర్ అయిన కార్మికులకు గౌరవం దక్కట్లేదు. పైపెచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి బస్భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. విధినిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబసభ్యుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రకరకాల కొర్రీలు పెట్టి, బెనిఫిట్స్ను నిలుపుదల చేస్తున్నారు. కనీస మానవతా విలువలు కూడా పాటించట్లేదు.
- వీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యుఎఫ్)