Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న బడ్జెట్ ప్రతిపాదన
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం నిర్ణయం
- కరోనా నష్టం లక్ష కోట్లు : కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిసింది. ఆ రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగిస్తారు. 16న ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. 17న శాసనమండలి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి కాబట్టి... ఆ తర్వాత రోజైన 18న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల మధ్య నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నది. బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనాలపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం... ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు,ఆర్ధిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సీఎంవో అధికారులు భూపాల్రెడ్డి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. శాఖల వారీగా పద్దులో పొందుపరచాల్సిన అంచనాలను, అధికారులు అందించిన నివేదికలను సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు. 2021 -22 సంవత్సరానికి ప్రతిపాదించబోయే బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని తెలిపారు. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు ఇప్పటికే అమల్లో ఉన్న గొర్రెల పంపిణీ, పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్ల కుర్మల కుటుంబాలు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే పంపిణీ చేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీ అంశాన్ని రాబోయే బడ్జెట్లో ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని వివరించారు. దేశంలోనే అత్యంత అధికంగా షీప్ పాపులేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదంటూ కేంద్రం గుర్తించిన నేపధ్యంలో... గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదనీ, మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని తెలిపారు. అందువల్ల దాన్ని కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేసీఆర్ చెప్పారు. దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని తెలిపారు. అయితే కరోనా అనంతర పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని వివరించారు. వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గతం కంటే రాబోయే బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారముందని అన్నారు.
శనివారం నాటి సమావేశంలో బడ్జెట్ అంచనాలు, కేటాయింపులకు సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యాయి. ఆదివారం నుంచి ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్, మున్సిపల్, విద్య, సాగునీటి పారుదల తదితర శాఖల అధికారులతో సీఎం భేటీ కానున్నారు. వారిని ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమన్వయం పరచటం ద్వారా ఆ శాఖ మంత్రి హరీశ్రావు వరసగా సమావేశాలు నిర్వహించనున్నారు. అన్ని శాఖలతో ఆయన సమాలోచనలు, సంప్రదింపులు జరిపిన తర్వాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్కు తుది మెరుగులు దిద్దనున్నారు.