Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ ట్రాక్టర్లకు డబుల్ రిజిస్ట్రేషన్లు
- గతంలో వ్యవసాయ ట్రాక్టర్లు.. ఇప్పుడు వ్యవసాయేతరంగా మార్పు
- అధికారుల తీరుతో సర్పంచ్ల ఇబ్బందులు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
చెత్త తరలించేందుకు ట్రాలీ, మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్, ఇలా గ్రామాల్లో అవసరాల కోసం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలతో గతేడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. చిన్న, పెద్ద తేడా లేకుండా, ఆదాయం ఉన్నా, లేకున్నా ఆఫీసర్ల ఒత్తిడి కారణంగా పల్లె పంచాయతీలకు ట్రాక్టర్లు కొన్నారు. ట్రాక్టర్ల కొనుగోళ్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సర్పంచ్లు, అధికారులకు కమిషన్ల వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఆ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు కూడా వివాదాస్పదం అయింది. గతేడాది ట్రాక్టర్లు కొన్న వెంటనే వ్యవసాయ ట్రాక్టర్లుగా అప్పటి అధికారులు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు మళ్లీ వ్యవసాయేతర ట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేయించాలని అధికారులు చెప్పడంతో అన్ని ట్రాక్టర్లు, ట్యాంకర్, ట్రాలీలను రెండోసారి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో తమకు రెండు సార్లు ఖర్చులు అవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు.
ఒక్కో పంచాయతీపై రూ.4వేలు భారం
ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని ఊర్లకు ట్రాక్టర్లు ఉన్నాయి. గతేడాది జనవరి నుంచి ట్రాక్టర్ల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ వాహనాలకు 100 శాతం ట్యాక్స్ మినహాయింపులు ఉండగా, తమకు కూడా ట్యాక్స్లు లేకుండా చేయాలని సర్పంచులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరును కోరారు. ముఖ్యమంత్రితో చర్చించి పన్నుల భారం లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ట్యాక్స్ మినహాయింపులు రాకపోవడం, తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందన్న కారణంతో అప్పటి అధికారులు అన్ని ట్రాక్టర్లను వ్యవసాయ ట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి సూచనలు రావడం, అగ్రికల్చర్ అవసరాల కోసం వాడని ట్రాక్టర్లను అలా రిజిస్ట్రేషన్ చేయడం కరెక్ట్ కాదన్న ఆదేశాలతో మళ్లీ అన్నింటినీ రెండోసారి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. లాక్డౌన్ దశల వారీగా ఎత్తేసిన తర్వాత, గతేడాది మే నుంచి ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 460కి పైగా ట్రాక్టర్లు అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ నుంచి నాన్ అగ్రికల్చర్ ట్రాక్టర్లుగా మార్చగా, ఇందులో సుమారు 450కి పైగా ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలకే చెందినవి కావడం గమనార్హం. గతేడాది ఒకసారి రిజిస్ట్రేషన్లు చేయించగా, ఇప్పుడు మళ్లీ మార్చించడంతో ఒక్కో ట్రాక్టర్కు రూ.4 వేల వరకు ఖర్చవవుతున్నట్టు చెబుతున్నారు. ఈ ఖర్చులను తామే సొంతంగా భరించాల్సి వస్తుందని సర్పంచ్లు వాపోతున్నారు.
ఇన్స్యూరెన్స్ కవరేజీ కోసమే : కిషన్ రావు, జిల్లా రవాణా శాఖ అధికారి
వ్యవసాయ ట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ అయితే రైతుకు చెందిన సొంత పంటను మాత్రమే తరలించాల్సి ఉంటుంది. ఇతర అవసరాలకు ఉపయోగిస్తే వాటికి ఇన్స్యూరెన్స్ వర్తించదు. కేసులు కూడా నమోదు చేయొచ్చు. అందుకే పంచాయతీ ట్రాక్టర్లను వ్యవసాయేతర ట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేస్తేనే డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రమాదం జరిగినా డ్రైవర్లకు రక్షణ ఉంటుంది.
మార్పులు చేస్తున్న మాట వాస్తవమే : ప్రభాకర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి
గ్రామ పంచాయతీలకు గతంలో కొన్ని ట్రాక్టర్లు వ్యవసాయ ట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్లు చేసిన మాట వాస్తవమే. రవాణా శాఖ అధికారుల సూచనల మేరకు మళ్లీ వాటిని వ్యవసాయేతర ట్రాక్టర్లుగా మారుస్తున్నారు. త్వరలోనే అన్ని ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు పూర్తవవుతాయి.