Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు ఆటపాటలతో బోధన
- సర్కారు బడులు బలోపేతం చేయడమే లక్ష్యం
- 1,250 మంది ఉపాధ్యాయులకు పూర్తయిన శిక్షణ
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సర్కారు బడుల్లో బోధన తీరు మారనుంది. దీనికోసం విద్యాశాఖ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ప్రాథమిక స్థాయిలోనే పిల్లల్లో విలువలు పెంపొందించడం, హాజరు శాతం పెంచడం, డ్రాప్ అవుట్స్ తగ్గించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల వైపు వారిని మళ్లించడం వంటివి సాధించడానికి విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత పోటీ యుగంలో కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ ఢిల్లీ, నేపాల్ పాఠశాలల్లో అమలవుతున్న 'సంతోష విద్యా' తరహాలో తెలంగాణలో కూడా హరివిల్లు (జారుఫుల్ లెర్నింగ్) అనే కార్యక్రమాన్ని రూపొందించి పాఠశాలల్లో అమలు చేయడానికి నిర్ణయించింది. దీన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
విలువలతో కూడిన విద్యను నేర్పిస్తారు..
ప్రధానంగా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందిస్తూ వారిలో ప్రేమ, వాత్సల్యం, గౌరవం, ఐక్యత, నమ్మకం, నిజాయితీ, ధైర్యం కృతజ్ఞత వంటి విలువను పెంపొందిస్తూ, ఆనందంగా విద్యను నేర్చుకోవడం కోసం బోధన కొనసాగించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ఈ హరివిల్లు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అంతేగాక ప్రాథమిక దశలో విద్యార్థులకు పాటలు, చిన్న కథలతో చదువు చెబితే బడికి రావడానికి ఇష్టపడుతారని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు ఏ కథలు చెబుతారో, ఎలాంటి ఆటలు ఆడిస్తారోననే ఆసక్తి చిన్నారుల్లో
పెరుగుతుంది. ఫలితంగా విద్యార్థుల హాజరుశాతం పెరగనుంది. వారానికి 1,2 పీరియడ్లు పాఠ్యాంశాలతో మానసిక సంసిద్ధత, కథలు చెప్పడం, సమన్వయ కృత్యాలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాలపై బోధిస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడం, మానసికంగా సిద్ధం చేయడం, వ్యాయామాలు, కథలు, ఆటలు, నాయకత్వ లక్షణాలు, భాషా విజ్ఞానం పెంపొందించేలా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
1,250 మంది ఉపాధ్యాయులకు శిక్షణ
హైదరాబాద్ జిల్లాలో 16 మండలాల్లో 492 ప్రాథమిక పాఠశాలలు, 8 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,250 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో హరివిల్లు కార్యక్రమాన్ని అమలు చేయడానికి హైదరాబాద్ జిల్లాకు చెందిన 27మంది రిసోర్స్ పర్సన్స్కు రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈ మాస్టర్ ట్రైనర్స్ జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రోజుకు మూడు సెషన్లలో 1250 మంది ఉపాధ్యాయులకు జూమ్యాప్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ విజయవంతంగా పూర్తిచేశారు. కాగా, ఒకటి, రెండు తరగతుల విద్యార్థులను ఒకటవ స్థాయిగాను, 3,4,5 తరగతుల వారిని రెండవ స్థాయిగాను విభజించి బోధన కొనసాగించనున్నారు. రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పాఠశాలలను బంద్ పెట్టడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు.
టీచర్లకు శిక్షణ విజయవంతంగా పూర్తిచేశాం : హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో హరివిల్లు కార్యక్రమాన్ని అమలు చేయనున్నాం. విద్యార్థులకు ఆటపాటలు, కృత్యాలు, కథలతో కూడిన బోధన జరిపి విలువలను పెంపొందించనున్నాం. కరోనా నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు విడుతల్లో జూమ్యాప్ ద్వారా శిక్షణ అందించాం. అయిదు రోజుల పాటు జరిగిన హరివిల్లు కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ ఉత్సాహంగా పాల్గొని, చక్కగా ప్రతిస్పందించడం సంతోషాన్ని కలిగించింది. సాంకేతిక సహకారం అందించిన ఆర్పీలకు, చక్కగా కో-ఆర్టినేట్ చేసిన సెక్టోరియల్ అధికారి వేణుగోపాల్ చారిని ఈ సందర్భంగా డీఈవో అభినందించారు.