Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మరణం ఆదివాసీ, గిరిజన, వ్యవసాయ కార్మికోద్యమాలకు తీరని లోటు అని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.బొజ్జి కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.పోడు సాగుదారుల హక్కు పట్టాల కోసం, గిరిజనులపై అటవీ అధికారుల వేధింపులపై అసెంబ్లీలో గళం విప్పిన నాయకుడని కొనియాడారు. అనేక భౌతిక దాడులకు, నిర్బంధాలకు గురైనా ప్రజలతో మమేకమై వారికోసమే జీవితాంతం పనిచేసిన ఆయన నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉద్యమాన్ని విస్తరింపజేసిన తీరును వివరించారు.
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపం
మాజీ ఎమ్మెల్యే కుంజాబొజ్జి మృతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మరణం కార్మికోద్యమానికి, గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉద్యోగ, కార్మికులకు తీరని లోటని పేర్కొన్నారు. మానవతా విలువలున్న ఆదర్శనాయకున్ని కోల్పోవటం బాధాకరమని తెలిపారు. ఆయన జీవితం నేటి యువతరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.