Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులు కనబడగానే బ్యాగ్తో పరార్
- ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు
నవతెలంగాణ-మియపూర్ (గచ్చిబౌలి)
డ్రైవర్గా పనిచేస్తూ ఇంటి యజమానినే బూరిడీ కొట్టించాడు. అదును చూసి.. రూ.50 లక్షలను దొంగిలించాడు. ఫోన్ సిగల్స్ ఆధారంగా పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోని డీసీపీ కార్యాలయంలోని మాదాపూర్ డీసీపీ వివరించారు. ధీరజ్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగమైన వైఎస్ ప్రసాద్, ఎంఎన్బి రాజుతో కలిసి ఈ నెల 3న మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్లో షాపింగ్కి వెళ్లారు. ధీరజ్ రెడ్డి వద్ద హనుమంత్ దొత్రే రెండు నెలల కిందట డ్రైవర్గా చేరాడు. ఆ రోజు వారితోపాటు కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన అతనికి కారులో రూ.50లక్షలు ఉన్న బ్యాగ్ కనిపించింది. ధీరజ్రెడ్డి వాళ్లు షాపింగ్కు వెళ్లగానే.. డబ్బు తీసుకుని తాళం కారులోనే పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. షాపింగ్ వెళ్లిన ధీరజ్రెడ్డి అతని మిత్రుడు పార్కింగ్లో ఉన్న కారు వద్దకు వచ్చేసరికే డ్రైవర్ కనబడలేదు. కారులో డబ్బులు ఉన్న బ్యాగ్ కూడా కనిపించలేదు. డ్రైవర్కు ఫోన్ చేస్తే స్విచాఫ్ రావడంతో వెంటనే వారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా నిందితున్ని జహీరాబాద్ మెయిన్ రోడ్డులో అదుపులోకి తీసుకొని విచారించారు. డబ్బు తీసుకొని లింగంపల్లి వరకు ఆటోలో వచ్చి.. ఇక్కడి నుంచి బస్సులో ముంబయికి చేరుకున్నానని నిందితుడు హనుమంత్ దొత్రే చెప్పాడు. అక్కడ తన సోదరుడు లక్ష్మణ్ దొత్రేతో కలిసి డబ్బులను వాడుకోవాలని అనుకున్నట్టు తెలిపాడు. కొంత డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టి, రెండు లక్షల రూపాయలను ఇంటి ఖర్చుల నిమిత్తం వాడుకున్నట్టు చెప్పాడు. అతని వద్ద 45 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు. త్వరగా కేసును ఛేదించిన ఏసీపీ రఘునందనరావు, డీఐ నవీన్ కుమార్, ఎస్ఐ గోపాల్రెడ్డి, ఎస్ఐ వీర ప్రసాద్, ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి, సిబ్బందిని డీసీపీ అభినందించి వారికి రివార్డులు ఇచ్చారు.