Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన సమస్యలపై తుదికంటా పోరాడిన నేత కుంజా బొజ్జి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మరణంపట్ల తీవ్ర సంతాపాన్నీ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన బొజ్జి.. అతి నిరాడంబరంగా ఉన్నారనీ, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
దిగ్భ్రాంతికి గురయ్యా... : పాటూరు రామయ్య
కుంజా బొజ్జి మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని సీపీఐ (ఎం) మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తామిద్దరమూ అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తామని తెలిపారు. గిరిజనులతోపాటు ఇతర ప్రజా సమస్యలన్నింటి పరిష్కారం కోసం కృషి చేశామని వివరించారు. భద్రాచలం డివిజన్లో బొజ్జితో కలిసి తాను మూడుసార్లు పర్యటించానని పేర్కొన్నారు. గతేడాది ఆయన్ను చూసి వచ్చానని తెలిపారు. బొజ్జితో తనకున్న బంధాన్ని, అనుబంధాన్ని పాటూరు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణంపట్ల తీవ్ర సంతాపాన్నీ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నిరాడంబర జీవితం గడిపారు : చెరుపల్లి
మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సంతాపం ప్రకటించారు. ఆయన నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నపుడు తమ్మినేని వీరభద్రంతో కలిసి నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించానని గుర్తు చేశారు. ఆ సమయంలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ ఉద్యమం గురించి అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు.
విలువలు కలిగిన నేత : వి శ్రీనివాసరావు
కుంజా బొజ్జి మరణానికి డీఎస్ఎంఎం జాతీయ సమన్వయకర్త వి శ్రీనివాసరావు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అత్యంత విలువలు, నిబద్ధత, అంకితభావం కలిగిన కమ్యూనిస్టు అని తెలిపారు. ఎన్నో నిర్బంధాలు, అవరోధాలను అధిగమించి పార్టీ ఎదుగుదలు దోహదపడ్డారని గుర్తు చేశారు.
ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఆదర్శ ప్రజా నాయకుడు, గిరిజనుల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్యే కుంజాబొజ్జి మరణం పట్ల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం, అనుసరణీయమని వివరించారు.
ఆదర్శ ప్రజానాయకునికి అశ్రునివాళి : టీఎస్యూటీఎఫ్
కుంజా బొజ్జి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సంతా పం ప్రకటించారు. ఎమ్మెల్యేగా పనిచేసినా నీతి, నిజాయితీలు చెక్కుచెదరకుండా నిరాడంబరంగా జనం మధ్య ఉన్న ఆయనకు మరణం లేదని తెలిపారు.
కుంజా బొజ్జి మరణం పీడిత ప్రజలకు తీరని లోటు : కేవీపీఎస్
మార్క్సిస్టు పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, నిస్వార్థ్యజీవి, నిరాడంబర జీవనం గడిపిన కుంజా బొజ్జి మరణం పీడిత ప్రజలకు తీరనిలోటని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెస్లీ, టి.స్కైలాబ్ బాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గిరిజన పోరాట యోధుడు కుంజా బొజ్జి : తెలంగాణ గిరిజన సంఘం
కుంజా బొజ్జి మరణం తెలుగు రాష్ట్రాల్లోని గిరిజనులకు తీరనిలోటనీ , గొప్ప గిరిజన పోరాట యోధున్ని కోల్పోయామనీ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన మతి పట్ల తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మానాయక్ రమావత్ శ్రీరామ్నాయక్లు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు సోమవారం తమ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ... గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ సంఘ నిర్మాణం ,విస్తరణకు ఎనలేని కషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.దర్మానాయక్, రాష్ట్ర నాయకులు కొర్ర భరత్నాయక్ ,ఆర్ శేఖర్నాయక్, ఆవాజ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి అబ్బాస్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.