Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్కట్లలో ధర్మాస్పత్రులు
- శస్త్రచికిత్సలపైనా కరోనా ఎఫెక్ట్
- వైద్యం పూర్తికాకముందే రోగుల ఇంటిబాట
- ముందస్తు జాగ్రత్తలు తీసుకోని సర్కారు
- పొంచిఉన్న వ్యాధులు..ఆందోళనలో రోగుల బంధువులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''కరోనా రెండో దశ వచ్చే ప్రమాదమున్నది. అది రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఆస్పత్రుల్లో ఇతర రోగుల సేవలకూ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని'' గత కొంతకాలంగా సర్కారు పదే పదే చెబుతూ వస్తున్నది. రాష్ట్రంలో రెండో దశ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వాస్పత్రుల్లో దీర్ఘకాలిక రోగులకు, ఎలెక్టివ్ శస్త్రచికిత్సల కోసం తగిన ఏర్పాట్లు చేయకపోవటంతో ఇన్పేషెంట్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో రోగులకు చేయాల్సిన శస్త్రచికిత్సలను పలుమార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పటికే నిమ్స్, ఉస్మానియా తదితర ఆస్పత్రుల నుంచి కరోనా ఎఫెక్ట్తో పలువురు రోగులకూ ఇంటికి పంపించేశారు. గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర రోగులకు తిరిగి ఎప్పుడు సర్జరీలు చేయగలుగుతామనే విషయాన్ని కూడా చెప్పకపోవడంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.
నిమ్స్, ఉస్మానియా లాంటి ఆస్పత్రుల్లో కరోనా బారిన పడకుండా ఐసోలేట్ గా ఉంచే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్కో వార్డులో పక్క పక్కనే పడకలు ఉండటంతో ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాధి వ్యాపిస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా ఎలెక్టివ్ సర్జరీలకు కొన్ని రోజుల ముందు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ సమయంలో శస్త్రచికిత్సలకు సిద్ధం చేసేందుకు అవసరమైన మెడికేషన్ చేస్తుంటారు. ఆయా శస్త్రచికిత్సల ఆధారంగా ఒక్కో రోగి వారం నుంచి 15 రోజుల వరకు ఆస్పత్రిలో ఆపరేషన్ కు ముందు ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇతర ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇలాంటి రోగులను హైరిస్క్ గ్రూపుగా భావిస్తుంటారు. అయితే వీరికి అందే సేవలకు విఘాతం కలగకుండా చూస్తామని చెప్పినా ఆ దిశగా చెప్పుకోదగ్గ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్యశ్రీ కింద చేరినా డబ్బులు కట్టాల్సిందే....
ఆరోగ్యశ్రీ కింద చేరినా పేద రోగులను డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి రావటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆమోదంతో ముందుగా రోగులను చేర్చుంటున్నారు. అయితే అనుకున్నట్టుగా సకాలంలో శస్త్రచికిత్స చేయకపోవటం, మధ్యలో కరోనా సోకటంతో డాక్టర్లు అనివార్యంగా డిశ్చార్జి చేస్తున్నారు. శస్త్రచికిత్స చేయకపోవటంతో ఆరోగ్యశ్రీ నుంచి ఆ డబ్బులను తిరిగి పొందే వీలు లేదు. దీంతో అంతకాలం ఇన్ పేషెంటుగా ఉన్నందుకు డబ్బులు చెల్లించాలని బలవంతం చేస్తున్నట్టు నిమ్స్ లో రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ చేయకుండా వాయిదా వేయటం, ఇంటికి పంపించటమే బాధాకరమైతే తిరిగి డబ్బులు కట్టాలని అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆదేశాలిచ్చి రోగులను ఆదుకోవాలని కోరుతున్నారు.