Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14న అంబేద్కర్ విగ్రహాలకు వినతులు...
- మే 3న విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడి : జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడల్ స్కూళ్లల్లో పనిచేసే కేర్టేకర్, ఏఎన్ఎం, వాచ్మెన్, వంట మనుషులు, ఇతర బోధనేతర సిబ్బందితో 24 గంటలు పనిచేయిస్తూ రూ.3 వేల నుంచి రూ.6,700 వేతనాలను మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సబబు? ఇదేం న్యాయం కేసీఆర్ సార్? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూళ్లు, హాస్టల్ ఉద్యోగులు, కార్మికుల యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎడ్ల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జె.వెంకటేశ్ మాట్లాడుతూ.. 2016 ఫిబ్రవరి 16న కనీస వేతనాల జీవో వస్తే నేటికీ అమలు కావడం లేదని విమర్శించారు. బేసిక్ వేతన జీవోలను వారికి వర్తింపజేయాలనీ, పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మోడల్ స్కూల్ బోధనేతర సిబ్బంది, కార్మికులు 14వ తేదీన అంబేద్కర్ విగ్రహాలకు, అక్కడకు వచ్చే ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయాలనీ, 22న డీఈఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. 19న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. 26న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలనీ, 27, 28 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తమ సమస్యలపై మొరపెట్టుకోవాలన్నారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మే 3వ తేదీన విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..మోడల్ స్కూల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులకు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుంటే ఎలా బతుకుతారు అని ప్రశ్నించారు.'కేర్టేకర్లకు రూ.25 వేలు, ఏఎన్ఎంలకు రూ.23 వేలు, వంట మనుషులకు రూ.21 వేలు ఇవ్వాలి. ఇప్పుడున్న సిబ్బందికి తోడు ప్రతి హాస్టల్కు అకౌంటెంట్, డే-వాచ్మెన్, కంప్యూటర్ ఆపరేటర్, ఇద్దరు స్కావెంజర్లు, ఇద్దరు స్వీపర్లను నియమించాలి.అనే తీర్మానాలను ఆ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎడ్ల రమేశ్ ప్రతిపాదించగా...సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.