Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ లీఫ్ వెంచర్స్ నుంచి వసూలు చేసిన అటవీశాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అనుమతుల్లేకుండా భారీ ఎత్తున చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అటవీ శాఖ భారీ జరిమానా విధించింది. వెంచర్ను విస్తరించటంలో భాగంగా వందలాది చెట్లను నరికేసిన సంస్థకు ఇరవై లక్షల రూపాయలను వసూలు చేసింది. దానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ సోమవారం వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బొమ్మరాస్పేట్లో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్లో పది రోజుల కిందట భారీగా చెట్లను నరికారు. ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు విచారణ జరిపించారు. వెంచర్ యాజమాన్యం అనుమతుల్లేకుండా వందలాది భారీ వృక్షాలను నరికేసిన విషయాన్ని నిర్ధారించి వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు. కోల్పోయిన పచ్చదనానికి బదులుగా భారీగా జరిమానా విధించారు. అదే సంస్థ మళ్లీ పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఆదేశాలిచ్చారు.
సొంత భూముల్లో అయినా చెట్లు కొట్టేందుకు అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనీ, అన్లైన్లోనూ అప్లరు చేసుకోవాలని పీసీసీఎఫ్ సూచించారు. కొద్ది మొత్తంలో అయితే జిల్లా అటవీ అధికారి, పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించాల్సి వస్తే డిస్ట్రిక్ట్ ట్రీ ప్రొటెక్షన్ కమిటీ విచారణ తర్వాత అనుమతి ఇస్తారని తెలిపారు. ప్రభుత్వం తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపునకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చెట్ల నరికివేతను నివారిస్తున్నామన్నారు.