Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లో, రోడ్డుపై కూరగాయలు పోసి నిరసన
- పండ్ల వాహనాల రాకతో నష్టపోతున్నామని ఆందోళన
- పోలీసులు సర్దిచెప్పడంతో విరమణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్లో అన్నదాతలు ఆగ్రహానికి గురయ్యారు. ఆరుగాలం కష్టపడి పంటను సోమవారం నాడు మార్కెట్కు తీసుకొస్తే అమ్ముడుపోలేదు. ట్రాఫిక్ సమస్యవల్ల తాము నష్టపోతున్నామని తమ ఘోస చెప్పుకునేందుకు అధికారుల వద్దకు పోతే నిరాశే ఎదురైంది. ఏమిచేయాలో పాలుపోక తాము పండించిన కూరగాయలను మార్కెట్లో రోడ్డుపైనే పోసి అరగంటకుపైగా నిరసన తెలిపారు. అయినా అధికారులెవ్వరూ స్పందించకపోవడంతో ఓపిక నశించి పక్కనే ఉన్న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వెళ్లి బైటాయించారు. అక్కడా కూరగాయలను పోసేందుకు యత్నించగా పోలీసులు సర్దిచెప్పారు. అరగంటలోపే అక్కడ నుంచి పండ్ల వాహనాలను పంపిచేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.కొత్తపేట పండ్ల మార్కెట్కు సీజనల్ పండ్లు ఆయా ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వస్తుండటంతో 15 రోజుల నుంచి పుచ్చకాయలు, తర్భుజ పండ్ల అమ్మకాలను ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్లో చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే, మొదటనే రైతులు, అక్కడి వ్యాపారులు వ్యతిరేకించారు. అసలే కరోనా....పెద్దసంఖ్యలో పండ్ల వాహనాలు వస్తే రద్దు ఏర్పడి కూరగాయలు అమ్ముడుపోవని అభ్యంతరం చెప్పడంతో అధికారులు నచ్చజెప్పారు. ప్రతిరోజూ యాభై నుంచి వంద డీసీఎం, బొలెరో వాహనాల్లో అక్కడకు పండ్లను తెచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. కమీషన్ ఏజెంట్ల నుంచి పండ్లను కొనుగోలు చేసేందుకు వందల సంఖ్యలో ఆటోలు వస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. దీంతో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి తమ కూరగాయలను తెచ్చే రైతులకు ఊరు నుంచి మార్కెట్ వద్దకు తేవడం ఒకెత్తు, మార్కెట్ గేటు నుంచి లోపలికి పోవడం మరొక ఎత్తు అవుతున్నది. మార్కెట్లో పండ్ల డీసీఎంలు, ఆటోలతో తీవ్ర ట్రాఫిక్ సమస్య, దానికితోడు కరోనా భయంతో చిరువ్యాపారులు ప్రత్యామ్నాయంగా వేరే మార్కెట్లవైపు వెళ్తున్నారు. దీంతో రైతులు తెచ్చిన వంకాయలు, టమాట, సొరకాయ, మిర్చి, దోసకాయ, మునగకాయలు, కాకరకాయలు, తదితర కూరగాయలు రెండుమూడు రోజులైనా అమ్ముడుపోక కమీషన్ ఏజెంట్ల వద్దనే మురిగిపోతున్నాయి. 'దొండకాయ తెచ్చి మూడు రోజులైంది. కొనేటోడు దిక్కులేదు. పండుపండి ఆగమైనాయి. ఇదేంటని కమీషన్ ఏజెంట్లను అడిగితే మేం చేయాలి అని చేతులెత్తేస్తున్నారు. రైతుల గోడును అర్థం చేసుకుని మార్కెటింగ్ శాఖ అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం పండ్ల అమ్మకాలను వేరే చోటికి తరలిస్తారో లేదో వేచి చూడాల్సిందే.