Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని బసవపున్నయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన సిద్ధాంత స్ఫూర్తిని, నిర్మాణ దక్షతను కొనసాగించాలనే ప్రతిజ్ఞ తీసుకుందామని చెప్పారు. సీపీఐ(ఎం) మాజీ పొలిట్బ్యూరో సభ్యులు మాకినేని బసవపున్నయ్య 29వ వర్ధంతి కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో జరిగింది. 'మార్క్సిజం, లెనినిజం వర్ధిల్లాలి, కామ్రేడ్ ఎంబీకి జోహార్, ఎంబీ ఆశయాలను సాధిస్తాం'అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అంతర్జాతీయ, జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సైద్ధాంతిక స్పష్టత అవసరమన్నారు. భౌతికంగా వర్గపోరాటాలు పెద్దఎత్తున సాగించే పరిస్థితి లేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు చరిత్రలో వచ్చినపుడు వాటిని ఎదుర్కొనే సైద్ధాంతిక స్థైర్యం ఉండాలని సూచించారు. మార్క్సిజం, లెనినిజం గమనాన్ని పరిశీలిస్తే ఇలాంటి ఒడిదుడుకులు సహజమని అన్నారు. ప్రపంచంలో కమ్యూనిస్టులు ఆటుపోట్లు ఎదుర్కోవడం ఇప్పుడే కొత్త కాదన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకటించిన నాటినుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆటంకాలు ఎదురైనపుడు సైద్ధాంతికంగా స్పష్టత లేనపుడే కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతిన్నదని వివరించారు. సిద్ధాంత ఆయుధం లేకుండా కేవలం కార్యకలాపాలతో ఊహాజనిత సోషలిజం నిర్మించలేమన్నారు. సోవియట్ యూనియన్, యూరప్లో వైఫల్యాలు కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతినడానికి కారణమని అన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం సమస్యలను పరిష్కరించడం వరకు బాగానే ఉన్నా సోషలిజం నిర్మించే పద్ధతులపై గందరగోళం ఉందనీ, కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయని వివరించారు. సోషలిజం నిర్మాణంపై సైద్ధాంతిక స్పష్టత ఉండాలని చెప్పారు. ఆర్థిక సంక్షోభం, కరోనా వైరస్ వ్యాప్తితోపాటు మానవాళి ఎదుర్కొనే సమస్యలను పెట్టుబడిదారీ విధానం పరిష్కరించలేదని అన్నారు. ఏ సమస్యనైనా సైద్ధాంతికంగా పరిష్కరించాలని చెప్పారు. ఆ కషి జరుగుతున్నదని అన్నారు. అనేక సమస్యలను సైద్ధాంతిక నిబద్ధతతో అర్థం చేసుకున్న మహానాయకుడు మాకినేని బసవపున్నయ్య అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, జి రాములు, బి వెంకట్, టి జ్యోతి, పోతినేని సుదర్శన్, మిడియం బాబురావు, ఎం సాయిబాబు, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.