Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 79,027 నమూనాలకే పరీక్షలు
- తాజాగా 2251 మందికి కరోనా
- ఆరుగురు మరణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''కరోనాను నిర్లక్ష్యం చేయవద్దు. అది సోకిన వారికి కాంటాక్ట్ అయిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఏ మాత్రం అనుమానించే లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలంటూ'' రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పదే పదే ప్రజలకు ఒకవైపు సూచనలు జారీ చేస్తున్నది. అదే సమయంలో మరోవైపు అందుకు కావాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో చేయకపోవటంతో పరీక్షల కోసం వచ్చిన వారిని సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నా దీన్ని నివారించేందుకు తగిన ఏర్పాట్లను చేయటం లేదు. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ లక్షకు పైగా టెస్టులు చేస్తున్నారు. కరోనా రెండో దశ నేపథ్యంలో ప్రజలు కూడా బారీగా వస్తుండటంతో అత్యధికంగా ఒక్క రోజులో 1,15,311 టెస్టులను చేశారు. కాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు మాత్రం 79,027 టెస్టులు మాత్రమే చేయగలిగారు. సిబ్బంది కొరత కారణంగా సెలవు రోజుల్లో కొన్ని కేంద్రాల్లో పూర్తిగా పరీక్షలు నిలిపివేయగా, మరికొన్ని కేంద్రాల్లో పరిమిత సమయంలో మాత్రమే చేసి ఆ తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపిస్తుండటంతో చేసిన టెస్టుల సంఖ్య తగ్గుతున్నది. అలా వెనక్కి పంపించిన వారి ద్వారా కరోనా మరింత వ్యాప్తి తీవ్రమవుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
2251 మందికి కరోనా
రాష్ట్రంలో తాజాగా 2251 మందికి కరోనా సోకింది. మరో 2,975 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలావుండగా 24 గంటల్లో కరోనాతో కోలుకన్న వారి సంఖ్య 565 మాత్రమే. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మొత్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,765కు చేరింది.
97,442 మందికి వ్యాక్సిన్
తాజాగా 97,442 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో 95,169 మంది మొదటి డోసు వేసుకోగా, 2,273 మంది రెండో డోసు తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 18,56,822 కాగా రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 3,02,015 గా నమోదైంది. మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 21,58,837కు చేరింది.