Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శం: సంతాపసభలో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే కుంజాబొజ్జి మరణం బాధాకరమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన ఆదర్శ కమ్యూనిస్టు అని, నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శమని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో కుంజా బొజ్జి సంతాపసభ జరిగింది. ఆయన చిత్రపటానికి తమ్మినేని సహా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆయన నిండు జీవితం గడిపారని చెప్పారు. చివరిదాకా కమ్యూనిస్టు ఉద్యమంతోనే మమేకమయ్యారని అన్నారు. నిరంతరం పార్టీ, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే వారని గుర్తు చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కషి చేశారని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని వేదవాక్కుగా భావించేవారని చెప్పారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా నిరాడంబరంగా, సామాన్యునిగా జీవించారని వివరించారు. జ్ఞాపకశక్తి, సైద్ధాంతిక నిబద్ధత, పార్టీ పద్ధతులు, విధానాలను ఆకలింపు చేసుకున్న వ్యక్తి అని అన్నారు. నిబద్ధత, ఆదర్శాలను నేర్చుకోవడమే ఆయనకిచ్చే నివాళి అని చెప్పారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ పాలకవర్గాల ఒత్తిళ్లకు, బేరసారాలకు అవకాశాలివ్వకుండా పార్టీ కోసం నిక్కచ్చిగా నిలబడ్డారని అన్నారు. ఆడంబరాలకు, దర్పానికి పోకుండా సామాన్యునిగా ఉంటూనే ఉన్నతంగా ఆలోచించే ఆదర్శప్రాయుడని కొనియాడారు. విలువల కోసం పనిచేసిన నాయకుడు కుంజాబొజ్జి అని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నంద్యాల నర్సింహ్మారెడ్డి, మిడియం బాబురావు, ఎం సాయిబాబు, జాన్వెస్లీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తారని చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఉంటూనే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసంతో చివరి వరకూ కమ్యూనిస్టుగా జీవించారని అన్నారు. నిర్బంధాలకు వెరవకుండా పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం కషి చేశారని వివరించారు. ఎర్రజెండాకే వన్నె తెచ్చిన వ్యక్తి బొజ్జి అని ఆయన సేవలను కొనియాడారు. అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ మాట్లాడుతూ భద్రాచలంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఐక్యత పెంపొందించడంలో కుంజాబొజ్జి కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఆయన త్యాగాలు ఈ తరానికి తెలియాలని అన్నారు. సీఐటీయూ సీనియర్ నాయకులు పి రాజారావు మాట్లాడుతూ ఆయన మాట, ఆయన జీవితం స్వచ్ఛమని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రజల మనిషి అని అన్నారు. సమాజంలో విలువలు అడుగంటిపోతున్న ఈ సమయంలో వాటికి ప్రతినిధిగా కుంజా బొజ్జి ఉన్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి అన్నారు. ఆయన బాటలో అందరం నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి రాములు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.