Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమ్మిన సిద్ధాంతంతో కడవరకు..
- మూడు సార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా..
నవతెలంగాణ-భద్రాచలం
ఏజెన్సీ సుందరయ్య ఇకలేరు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్పటికీ సాధారణ, సామాన్య జీవితం గడపటం ఆయన సొంతం. సీపీఐ(ఎం) అంటే చిన్ననాటి నుంచి ఎంతో మక్కువ. ప్రాణం కంటే నమ్మిన సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఆయనకు ఆయనే సాటి. నాడు సీపీఐ(ఎం)కి రాజీనామా చేయాలని మావోయిస్టులు తుపాకులతో బెదిరిస్తే.. ప్రాణమైన తీసుకుంటా గానీ పార్టీకి రాజీనామా చేయనని ఎదురొడ్డిన ధైర్యశాలి. ఏజెన్సీ సుందరయ్యగా అందరికీ నచ్చిన, మెచ్చిన వ్యక్తి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి(95) అస్తమించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఓ ప్రయివేట్ వైద్యశాలలో సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో, శ్వాస కోశ వ్యాధితో బాధ పడుతూ భద్రాచలం ప్రయివేటు ఆస్పత్రిలో, హైదరాబాదు లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల కిందట భద్రాచలం తీసుకొచ్చి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం తో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీ ఖమ్మం, కొత్తగూ డెం జిల్లాల కార్యదర్శులు సందర్శించి నివాళి అర్పించారు.
రాజకీయ నేపథ్యం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద రామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామంలో కుంజా జోగయ్య-లచ్చమ్మ దంపతులకు 1926 ఫిబ్రవరి 10వ తేదీన ఆరో సంతానంగా బొజ్జి జన్మించారు. 1948లో లాలమ్మతో వివాహం జరిగింది. ఆయన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. 1970లో వరరామచంద్రపురం(వీఆర్ పురం) మండలం రామవరం సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా కుంజా బొజ్జి నిలిచి, గెలిచారు. భద్రాచలం ఏజెన్సీలో నిరుపేద గిరిజన, గిరిజనేతరుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల కూలి పెంపు కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. సీపీఐ(ఎం) మహానేత సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని కుంజా జొజ్జి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఈ క్రమంలో ఆయనను ఏజెన్సీ సుందరయ్యగా ప్రజలు పిలిచేవారు.
అదేవిధంగా 1989, 1994లో కూడా సీపీఐ(ఎం) తరపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొజ్జి కాలినడకనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ప్రజల్లో మంచి పేరు గడించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సైకిల్ పైనే కార్యాలయానికి వెళ్లే వారు. సైకిల్ పైనే తిరుగుతూ ఉండేవారు.
కుటుంబ నేపథ్యం ..
కుంజా బొజ్జికి ఆరుగురు సంతానం కాగా, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒక కుమారుడు మృతిచెందారు. మూడు సంవత్సరాల కిందట బొజ్జి భార్య మృతిచెందారు. భార్యతో కలిసి పూరి గుడిసెలో జీవించేవారు. ఆమె మరణం తరువాత కొద్ది కాలం నుంచి భద్రాచలంలోని కూతురు వద్ద ఉంటున్నారు.
మూగబోయిన ఏజెన్సీ..
ఏజెన్సీ ముద్దుబిడ్డలు.. సున్నం రాజయ్య, కుంజా బొజ్జి. గత ఏడాది ఆగస్టులో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అకాల మరణం చెందారు. తాజాగా సోమవారం మాజీ ఎమ్మెల్యే కుంజా బోజ్జి కూడా మృతిచెందడంతో ఏజెన్సీ మూగబోయింది. ఏజెన్సీకి ఆణిముత్యాలుగా ఉన్న ఈ ఇరువురిని కోల్పోయి ఆదివాసులు పుట్టెడు ద్ణుఖంలో ఉన్నారు.