Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దౌల్తాబాద్
కూతురు పెండ్లికి చేసిన అప్పులు ఓ వైపు.. తన 10 గుంటల భూమి కూడా తన పేరు మీద కాకుండా పోతుందనే ఆవేదన మరోవైపు ఉండటంతో మనస్తాపానికి గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అహ్మద్నగర్ గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..అహ్మద్నగర్కు చెందిన షేక్ ఖాసిం(55)కు 10 గుంటల భూమి ఉన్నది. అయితే ఆన్లైన్ సర్వేలు వచ్చిన తర్వాత.. ఆ భూమి ఆన్లైన్లో తన పేరు మీద చూపించడం లేదు. దీనికి తోడు ఏడాది కిందట కూతురు వివాహానికి కొంత అప్పు చేశాడు. రోజురోజుకు ఆ అప్పు పెరుగుతూ వస్తున్నది. మరోవైపు కరోనా కారణంగా కూలి పనులు కూడా దొరకడం లేదు. తన భూమి తనకుకాకుండా పోతుందనే ఆవేదనతో పాటు.. రూ.2,50,000 అప్పు తీర్చే మార్గం లేదని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో అతడు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. అతను మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. రైతు చిన్న కుమారుడు జయద్ ఫిర్యాదు మేరకు దౌల్తాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.