Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కిన వైనం
- కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు
నవతెలంగాణ-కోదాడరూరల్
నల్లగొండ జిల్లా సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సాగర్ ఉపఎన్నిక సందర్భంగా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా లక్షమందితో హాలియాలో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. పేదలు కరోనా బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం పోలీసు వాహనాల్లో మద్యం, డబ్బులను తరలిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎన్నికల కమిషన్కు చెప్పారు. సాగర్లోని ప్రతి మండలం సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాగర్లో స్థానికేతర నాయకులు వేల మంది మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారని, నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని అన్నారు. వారంతా వెంటనే వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. అనుమతుల్లేని వాహనాలను సీజ్ చేయాలని కోరారు. డబ్బు, మద్యం ప్రలోభాలు చూపి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒత్తిడికిలోనై రాష్ట్ర, జిల్లా అధికారులు ఎలక్షన్ నియమ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. జిల్లా పాలనాధికారికి పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల రోజున పోలింగ్ బూతుల వద్ద డబ్బులు పంచకుండా కేంద్ర బలగాలను మోహరింపజేయాలన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి స్పందించిన ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని ఉత్తమ్ తెలిపారు.