Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీ మారుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. ఇది బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ తప్పుడు వీడియోను విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల లబ్దిపొందారని విమర్శించారు.సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ ఉన్నత విలువలు, ఆదర్శప్రాయమైన రాజకీయాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి జానారెడ్డి అని భట్టి కొనియాడారు. అలాంటి వ్యక్తిపై బండి సంజరు చేసిన వ్యాఖ్యలు అత్యంత చౌకబారుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి గురించి తెలిసిన ఏ ఒక్కరూ బండి సంజరు మాటలను విశ్వసించరని తెలిపారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేసేందుకు అధికార టీఆర్ఎస్తో కలిసి బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని ప్రజలు గుర్తించారన్నారు. సాగర్ ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అధికార పార్టీకి ఎన్నికలు వ్యాపారంలా మారిపోయాయని.. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడకు వెళ్లి నేతలను కొనుగోలు చేయడం పరిపాటిగా పోయిందని విమర్శించారు.