Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యావాలంటీర్ ఆత్మహత్య
- నల్లగొండ జిల్లాలో ఘటన
నవతెలంగాణ - నల్లగొండ
కరోనా కారణంగా పాఠశాలలు పనిచేయక 15 నెలలుగా వేతనం రాకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది.. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. మనస్తాపం చెందిన ఓ విద్యావాలంటీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పాలకూరి అమరేందర్-భార్య శైలజ (30) భార్యాభర్తలు. మునుగోడు రోడ్డులోని హౌజింగ్ బోర్డులో నివాసముంటున్నారు. వారికి పాప ఉంది. అమరేందర్ కూలి పని చేస్తుండగా, శైలజ విద్యావాలంటీర్గా పని చేస్తోంది. శైలజకు 15 నెలలుగా వేతనం రావడం లేదు. మరోవైపు అమరేందర్కు కూడా పనులు సరిగా దొరకడం లేదు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. దాంతో మనస్తాపం చెందిన శైలజ సోమవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పంచనామా నిర్వహించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యావాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం నాయకులు కోరారు. వెంటనే వారిని రెన్యూవల్ చేయాలని, విధుల్లోకి తీసుకుని వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యావాలంటీర్ ఆత్మహత్యకు నిరసనగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, నిరుద్యోగ జేఏసీ, తెలంగాణ ప్రయివేటు టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు వద్ద ధర్నా నిర్వహించారు.