Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల హృదయాల్లో నిలిచిన అమరజీవి కుంజా బొజ్జి
- ఎర్ర జెండాకు వన్నెతెచ్చిన మాజీ ఎమ్మెల్యే
- పార్టీ నిర్ణయాలకు, ఆశయాలకు అంకితమైన ఆదర్శ నేత
- మన్నెంలో పూసిన ఎర్రమందారాలు బొజ్జి, రాజయ్య : సంతాప సభలో తమ్మినేని
- రాబోయే తరానికి బొజ్జి ఆదర్శం : ఎస్ వీరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అమరజీవి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద రామచంద్రాపురం (వీఆర్పురం) మండలం అడవి వెంకన్నగూడెం గ్రామంలో కుంజా బొజ్జి అంత్యక్రియలు ముగిసాయి. బొజ్జి భౌతికకాయానికి తమ్మినేనితోపాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారం తిరమయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం ప్రసంగించారు. పార్టీ నిర్ణయాలకు, ఆశయాలకు కుంజా బొజ్జి అంకితమై పని చేశారన్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బొజ్జి పనిచేసినప్పటికీ సాధారణమైన, సామాన్యమైన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. నిరంతరం ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వారన్నారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఎంతో లోతైన అధ్యయనం చేసేవారని చెప్పారు. జ్ఞాపకశక్తి, సైద్ధాంతిక నిబద్ధత, పార్టీ పద్ధతులు, విధానాలను ఆకళింపు చేసుకున్న వ్యక్తి అన్నారు. ఉత్తమమైన, ఆదర్శవంతమైన, నిజమైన కమ్యూనిస్టు నేత బొజ్జి అని చెప్పారు. ఎర్రజెండాకు వన్నెతెచ్చిన మహానేత అన్నారు. అదేవిధంగా, మన్నెంలో పూసిన ఎర్ర మందారాలు మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజా బొజ్జిని, గిరిజన ఉద్యమాల ధ్రువతారలుగా వారు నిలిచిపోయారని అన్నారు. ఆదివాసీలకు అండగా నిలబడటమే వారికి మనం ఇచ్చే నిజమైన, ఘనమైన నివాళి అని అన్నారు. బొజ్జి ఆశయ సాధనకు అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. అమరజీవి కుంజా బొజ్జి ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలన్నారు. బొజ్జి జీవితం ఈ తరానికే కాదు రాబోయే తరాలకు కూడా ఎంతో ఆదర్శమన్నారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సాధారణ జీవితం గడిపిన కుంజా బొజ్జి అందరికీ ఆదర్శమని అన్నారు. ఏజెన్సీలోని ఎన్నో సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో తన వాణిని వినిపించారని చెప్పారు. భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు మాట్లాడుతూ.. బొజ్జి నమ్మిన సిద్ధాంతం కోసం నిజమైన కమ్యూనిస్టుగా జీవించారని అన్నారు.
సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కుంజా బొజ్జి సాధారణ జీవితం ఎందరికో ఆదర్శం అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడారు. నిజమైన ఆదర్శ కమ్యూనిస్టు బొజ్జి అన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమగోదావరి జిల్లాల కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, రవి, సీఐటీయు రాష్ట్ర నాయకులు భూపాల్, బి.మధు, వంగూరు రాములు, రాజమహేంద్రవరం కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కుంజా బొజ్జి మృతికి ఏచూరి సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ఉద్యమనేత కుంజాబొజ్జి మరణం పట్ల సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం తెలిపారు. అనారోగ్యంతో ఆయన సోమవారం మరణించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఏపీలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ అందించారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచిత పాత్ర పోషించారనీ, దళంలో కొరియర్గా పనిచేశారని గుర్తు చేశారు.
1980లో ఆయనపై నక్సలైట్లు భౌతిక దాడి చేశారనీ, చనిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల కోసం పనిచేశారనీ, సొంత ఇంటిస్థలం, మొబైల్ ఫోన్ లేకుండా నిరాడంబరంగా జీవించారని వివరించారు. ప్రభుత్వం ఇస్తామన్న ఇంటిస్థలాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీలకు ఆయన చేసిన సేవ అపారమైందని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నిజమైన కమ్యూనిస్టు : బృందాకరత్
మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతికి సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ సంతాపం తెలిపారు. ధైర్యానికి, అంకితభావానికి ఆయన ప్రతీక అని పేర్కొన్నారు. ఆయన నిజమైన కమ్యూనిస్టు అని వివరించారు. ఆదివాసీల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆదివాసీల హక్కుల నేతగా గుర్తింపు పొందారని వివరించారు. ఆయన నిరాడబర జీవితం ఈ తరానికి ఆదర్శమని తెలిపారు. పోలీసుల నిర్బంధాలను ఎదు ర్కొని భూమి, కూలిరేట్ల పెంపు కోసం అనేక ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమంటే ప్రజల్లో ఆయనకున్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. నక్సలైట్లు రెండుసార్లు దాడి చేసినా ధైర్యంగా ముందుకుపోయారనీ, ప్రజల కోసం పనిచేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే వారందరికీ ఆయన ఆదర్శమని వివరించారు.
ఉద్యమాలకు తీరనిలోటు : బివి రాఘవులు
మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మరణం పట్ల సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యు లు బివి రాఘవులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ప్రజా, గిరిజన ఉద్యమాలకు తీరనిలోటని తెలిపారు. ఆయన పోరాటపటిమ, నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.