Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ టెస్టింగ్ కేంద్రాల నుంచి సమాధానం
- ప్రతి పీహెచ్సీ ఎదుట భారీగా లైన్లు
- 12 గంటల్లోపే టెస్టింగ్ బంద్
- నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తున్న వైరస్
- ఊసేలేని మొబైల్ టెస్టింగ్ కేంద్రాలు..
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
30 యేండ్ల రమేష్ నిజామాబాద్లోని ఓ ప్రయివేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రెండ్రోజుల కిందట ఆయన పని చేస్తున్న కార్యాలయంలో ఒకరిద్దరికి కొవిడ్ నిర్ధారణ అయింది. తన ఇంట్లో ముసలివాళ్లు, చిన్న పిల్లలున్నారు. నగరంలోని ఓ పీహెచ్సీకి టెస్టింగ్ కోసం వెళ్లాడు. కానీ ఈ రోజు చేయాల్సిన టెస్టులు అయిపోయాయి. రేపు రండి.. అని సమాధానం వచ్చింది.
'26 యేండ్ల విశాల్.. తన అత్తమ్మకు కొవిడ్ నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్తగా టెస్టింగ్ కోసం ఓ పీహెచ్సీకి వెళ్లాడు. కానీ వందల సంఖ్యలో ఉన్న రోగులతో భారీ లైన్ చూసి ఇంటిమొఖం పట్టాడు'.
ఈ రెండు ఉదాహరణలు చాలు నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ కేంద్రాలకు రోగులు పోటెత్తుతున్న వైనాన్ని తెలియజేసేందుకు. మధ్యాహ్నానానికి పీహెచ్సీలలో టెస్టులు నిలిపేస్తున్నారు. ఒకవేళ వెనుదిరిగిన వారిలో పాజిటివ్ రోగులు ఉంటే వారంతా క్యారియర్లుగా మారి మరింత మందికి వైరస్ను అంటిస్తున్నారు.
జిల్లాలో కోవిడ్ విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం వేలాది మంది అనుమానితులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పీహెచ్సీ నుంచి మొదలు జిల్లా ఆస్పత్రి వరకు ఏటు చూసినా వందలాది మంది రోగులు టెస్టులు కోసం క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పీహెచ్సీలలో టెస్టింగ్ లక్ష్యం పూర్తవుతోంది. ప్రస్తుతం పీహెచ్సీలలో ప్రతిరోజూ వంద వరకు మాత్రమే టెస్టింగ్లకు అనుమతించారు. ఫలితంగా రోగులు, అనుమానితులు టెస్టులు చేసుకోకుండానే ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు.