Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ, తెలంగాణ ఇంటర్బోర్డులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించాలని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డును హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. సీనియారిటీ జాబితా తయారు చేసి ఏపీ, తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు కలిసి సమిష్టిగా చర్చించి ఉద్యోగుల విభజనచేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఉత్తర్వులు అందిన రెండు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జాబితా తయారీ యంత్రాంగం సిబ్బంది సీనియార్టీ ప్రకారం ఉద్యోగుల విభజనను నెల రోజులలోగా కేటాయింపులు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ రామచంద్రన్, జస్టిస్ వినోద్కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగుల విభజన అంశంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఆ తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని 82 సెక్షన్ ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది సీనియారిటీని లెక్కించలేదనీ, దీంతో తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులోనూ, ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులోనూ పని చేస్తున్నారని పేర్కొంటూ ఎస్. సావిత్రి ఇతరులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఇంటర్ బోర్డు అధికారులు ఉద్యోగుల విభజన చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆస్తులు, అప్పుల పంపకాలు చేయక పోయినప్పటికీ ఉద్యోగుల విభజన చేయవచ్చని వారి వాదన వినిపించారు. అనంతరం కోర్టు పై విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.