Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
- 472 మంది లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు అందజేత
- మరో కార్యక్రమంలో మంత్రి కొప్పులతో కలిసి వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ..
నవతెలంగాణ-సిద్దిపేట
'మీ ఇండ్లను మీ పేరిట శాశ్వత పట్టా చేశాం.. ఏండ్ల నుంచి మీకున్న రందిని దూరం చేశాం.. మున్సిపాలిటీలో సైతం ఆన్లైన్లో మీ ఇండ్ల పేరిట అసెస్మెంట్ ఎంట్రీ చేశాం.. ఇవాళ్టి నుంచి సర్వ హక్కులు మీకే ఉండేలా భద్రత కల్పించి పట్టా ధవీకరణ పత్రాలు అందజేస్తాన్నాం' అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్లో బుధవారం పొన్నాల శివారు, నర్సాపూర్-గుండ్ల చెరువు, హరీశ్ నగర్, వికాస్ హైస్కూలు సమీప ప్రాంతాల్లోని కాలనీలకి చెందిన 472 మంది ఇండ్లకు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏండ్ల కింద స్థలం కొని ఇండ్లు కట్టుకుని.. సంబంధిత ఇండ్ల పట్టా కాగితం లేక, దిగులు చెందుతున్న వారికి.. నేటి నుంచి ఆ ఇండ్లపై సర్వ హక్కులు ఉండేలా భద్రత కల్పించి ధవీకరణ పత్రాలు అందించామన్నారు. చట్టరీత్యా వారు భూమి కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నారని, వారికి పట్టాలు ఇస్తే మేలు జరుగుతుందని ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు.
'వికలాంగులను చిన్నచూపు చూడటం తప్పు.. వారికి మనం చేయూతనివ్వాలి.. వాళ్లను అవమానిస్తే కఠినంగా శిక్షిస్తాం' అని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు అవసరమైన, విలువైన ఉపకరణాలను మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. జిల్లాలో 516 మంది లబ్దిదారులకు రూ.80లక్షల విలువ గల ఉపకరణాలు అందిస్తున్నామని, సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునేందుకు ముందుకొచ్చే వారికి సాయం చేసేందుకు బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయించినట్టు హరీశ్రావు తెలిపారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి హరీశ్రావు సిద్దిపేటను గొప్పగా అభివృద్ధి చేశారని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. వికలాంగులకు కేసీఆర్ కొండంత అండగా నిలిచారని, దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.21కోట్లతో 17వేల మందికి ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు, సుడా చైర్మెన్ రవీందర్ రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ విజరు, డిప్యూటీ తహసీల్దార్ రాజేశం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.