Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
పుస్తక పఠనం ద్వారా సమాజాన్ని అధ్యయనం చేయవచ్చని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్సింగ్ గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా పస్రా-163 జాతీయ రహదారిపై కూడలిలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేదికలో నర్సిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఎదుగుదలకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం లండన్ ద్వారా చదివిన ముగ్గురు కారల్ మార్క్స్, బీఆర్ అంబేద్కర్, అలెగ్జాండర్ చరిత్రలో ప్రఖ్యాత స్థానంలో నిలిచిపోయారని అన్నారు. నిరుద్యోగ యువకులకు కాంపిటీషన్ మాత్రమే కాకుండా గ్రంథాలయాలు సమాజాన్ని చదవడం కోసం, మానసిక విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఒక గుడి ఉన్నట్టే ఒక గ్రంథాలయం ఉంటే ప్రపంచ మేథావులను తయారు చేయొచ్చన్నారు. పోటీ పరీక్షలకు కాకుండా సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పుస్తక పఠనం ద్వారా సమాధానం చెబుతారని అన్నారు. ప్రభుత్వాలే బాధ్యతాయుతంగా ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి ప్రజలకు పుస్తక పఠనం అలవాటు చేయాలన్నారు. పస్రా గ్రామంలో భగత్సింగ్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి రత్నం, యూటీఎఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కిరణ్, కార్యదర్శి ఆర్.వాసుదేవ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, డీటీఎఫ్ జిల్లా నాయకులు చాప బాబుదొర, ఎంపీటీసీ స్వరూప, సర్పంచ్ రాము, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వెంకన్న, గ్రంథాల నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.