Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం చెల్లించడంలో సింగరేణి విఫలం: సీపీఐ(ఎం) జయశంకర్ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు
నవతెలంగాణ-గణపురం
సింగరేణి ఓసీ3లో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జయశంకర్ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోరుతూ చేపట్టిన పాదయాత్ర బుదవారం 16వ రోజు గణపురం, దర్మరావుపేట, బస్వరాజుపల్లి, పరుశరాంపల్లి ఓసి 3 లాంగ్వాల్ ప్రాజెక్టు మీదుగా భూపాలపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో సాయిలు మాట్లాడారు. ఓసీ3లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కొందరికి ఇప్పటివరకు సింగరేణి సంస్థ నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నష్టపరిహారం ఇవ్వకుండానే ఓసీ3ని ప్రారంభించారని, బొగ్గు ఉత్పత్తి కూడా ప్రారంభం అయిందని అన్నారు. మాధవరావుపల్లి, కొండంపల్లి నగరంపల్లి, పరుశరాంపల్లి, భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండానే సింగరేణి పనులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లి లాంటి భూములను సింగరేణి తీసుకుని నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాక్షస పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. గ్రామాల్లో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. మండలంలో కేటీపీపీ ఓసీ3 ప్రాజెక్టులున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. రెండు కంపెనీల్లో గణపురం మండల నిరుద్యోగ యువకులను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో మిర్చి, వరి, పత్తి, మామిడి రైతులు నష్టపోయారని, సర్వే చేసి వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు చెన్నూరి రమేష్, రాజేందర్, దేవేందర్, వినరు కుమార్, అరవింద్, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.