Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసి ముద్దయిన చేతికందొచ్చిన పంట
- నేలవాలిన పైరు
- కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల కిందకు నీరు
- మహబూబ్నగర్లో రైతులు, టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట
- ఎమ్మెల్యేకు సమస్యను వివరిస్తుండగా ఘటన
నవతెలంగాణ- విలేకరులు
అకాల వర్షం రైతులను ఆగం చేస్తోంది.. చేతికందొచ్చిన పంట తడిసిముద్దయింది. ఇప్పటికే కోసి అమ్మకాలకు సిద్ధం చేసిన ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతో రైతులు మూల్యం చెల్లించు కోవాల్సి వచ్చింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసిన ధాన్యం వర్షానికి తడిసింది. గాలి దుమారానికి టార్పాలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం మొత్తం నీటిపాలైంది. అదేవిధంగా కోతకు సిద్ధంగా ఉన్న పైరు నేలవాలింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్లోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, శంకర పట్నం మండలాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. సుమారు 4వేల ఎకరాల్లోని వరి పైరు నేలవాలింది. జమ్మికుంటలో తడిసిన వరి ధాన్యాన్ని తెలంగాణ రైతు సంఘం నాయకులు బుధవారం పరిశీలించారు. పలుచోట్ల కోసి ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసింది. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరింది. ఈదురు గాలితో
తాటిపత్రులు లేచిపోయాయి. రోడ్లపైన పోసుకున్న రాసుల కిందకు వర్షపు నీరు చేరింది. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్లో సుమారు 3వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో, కొత్తకోట మండలంలో, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం బుధవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది. గాలి వానతో కూడిన వర్షం పడటంతో టార్పాలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యమంతా తడిసింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, మద్దతు ధర రూ.2,500 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జీఎస్.గోపి, సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులతో కలిసి వెళ్లి ఎమ్మెల్యేకు సమస్యను విన్నవిస్తుండగా.. టీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దాంతో తోపులాట జరిగింది.తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన రైతులను తోసేసినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణ మని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై దాడి చేసేందుకు వచ్చిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.