Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించండి
- అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐకేఎస్సీసీ నేతల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగంపై, హక్కులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న దాడిని తిప్పికొట్టాలని ఏఐకేఎస్సీసీ పిలుపునిచ్చింది. హక్కులను పరిరక్షించుకోవడానికి ఐక్యంగా ఉద్యమించాలని కోరింది. ఏఐకేఎస్సీసీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగంలోని విలువలు, హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, పశ్యపద్మ, వేములపల్లి వెంకట్రామయ్య విలేకర్లతో మాట్లాడుతూ మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయిందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విలువలు, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, రాష్ట్రాల హక్కులు ఏనాడూ అమలు జరగలేదని చెప్పారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన సాగు చట్టాలతో తీవ్రమైన నష్టం జరుగుతున్నదని చెప్పారు. ఈ చట్టాలు దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని దాసోహం అయ్యేవిధంగా ఉన్నాయని విమర్శించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న కనీస మద్దతు ధరలు, ప్రభుత్వ సేకరణ, ప్రజా పంపిణీ, వ్యవసాయ మార్కెట్ వ్యవస్థల రద్దుకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ సబ్సిడీలు మాయమవుతాయన్నారు. దీని ఫలితంగా రైతాంగం, వినియోగదారులు దెబ్బతింటారనీ, కోట్లాది మంది ఉపాధి కోల్పోతారనీ, ఆహార భద్రత హక్కులను కోల్పోతారని చెప్పారు. వ్యవసాయం గిట్టుబాటుకాక భూమి కోల్పోయి రైతులు కూలీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగం పాలిట ఉరితాళ్లుగా మారిన సాగు చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గత 139 రోజులుగా దేశ వ్యాపితంగా, ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్న రైతు ఉద్యమాన్ని దెబ్బతీయటానికి మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఉద్యమంపై విషప్రచారం చేయడంతోపాటు తీవ్ర నిర్భంధం కొనసాగిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, ఐఎఫ్టీయు నాయకురాలు ఎస్ఎల్ పద్మ, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, బోయినపల్లి రాము, అరుణ, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, నాయకులు ఆర్ అంజనేయులు, రైతు సంఘం నాయకులు కిషోర్, వ్యకాస అధ్యక్షులు కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.