Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర కాంగ్రెస్ది
- సమైక్యాంధ్ర నాయకుల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
- నాకు ముఖ్యమంత్రి పదవి ప్రజలిచ్చారు..
- రెండో విడతలో 3 లక్షల మందికి గొర్రెల యూనిట్లు
- ప్రజా దర్బార్ పెట్టి పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తా : హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఆగం కావొద్దు..అభివృద్ధి గురించి ఆలోచించి ఓటేయండి.'కాంగ్రెసోళ్లు బిచ్చగాళ్లు.. సమైక్యాంధ్ర నాయకుల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర వారిది. నాగార్జున సాగర్కు జానారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నోముల భగత్ గెలుపు ఖాయమైంది' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపును కాంక్షిస్తూ బుధవారం హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. సభకు ప్రజలు రాకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు ఆమోదయోగ్యం కాదన్నారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నాయని, కానీ ఇక్కడ ప్రతిపక్షాలకు విచిత్రమైన పరిస్థితి ఉందని అన్నారు. ఎవరు మంచి చేస్తున్నారో.. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలే సమీక్ష చేసుకోవాలని కోరారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతదో వారినే గెలిపించాలన్నారు. నోముల భగత్ విద్యావంతుడని, మంచి విజన్ ఉన్న వ్యక్తి అని అన్నారు. జానారెడ్డి 30 ఏండ్ల ప్రస్థానంలో చేసిందేమీ లేదన్నారు. సాగర్లో కనీసం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయించలేకపోయారని విమర్శించారు. హాలియాలో డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.
సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ ప్రజలనీ, కాంగ్రెస్ వాళ్లు కాదని స్పష్టం చేశారు. ఉద్యమం మొదలుపెట్టిన నాడే తాము పదవులను గడ్డి పోచలెక్క తీసి పడేశామన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేసి ఇక్కడి ప్రజలకు నీళ్లందిస్తామని చెప్పారు. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా కట్టాల్సిన చోట కట్టలేదని, ఆనాడే మనకు అన్యాయం జరిగిందని అన్నారు.
రెండో ఫేజ్లోనూ 3 లక్షల మందికి గొర్రెల యూనిట్లు ఇస్తామని, సబ్సిడీ పెంచుతామని సీఎం ప్రకటించారు. మళ్లీ 20 రోజుల్లో ఇక్కడికి వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పారు. నల్లగొండ జిల్లాలో మంజూరు చేసిన అన్ని లిఫ్టులనూ పూర్తి చేసి చూపిస్తానన్నారు. ప్రజాదర్బార్ పెట్టి పొడు భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రచార సభకు సీఎం కేసీఆర్ రాకుండా కాంగ్రెస్ ఎన్నో కుట్రలు పన్నిందన్నారు. సీఎం కేసీఆర్ అంటేనే వాళ్లకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన గొప్ప మహానాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఫ్లోరైడ్ను పారదోలిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పంటలు పండించిన ఘనత ఉమ్మడి నల్లగొండ జిల్లాకు దక్కిందన్నారు. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి భగత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వదించి తనకు అవకాశం ఇచ్చారన్నారు. నోముల నర్సింహయ్యను ఆదరించిన విధంగానే తననూ ఆదరించాలని కోరారు. నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఈ సభలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.