Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 సర్కిళ్లలో 63 మినీ
కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు
- స్పెషల్ శానిటేషన్
- నిబంధనలపై స్పష్టత ఇవ్వని బల్దియా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో చేస్తున్న పరీక్షల్లో 30 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో గ్రేటర్ హైదరాబాద్లో మరోసారి కంటైన్మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ ప్రకటించింది. 30 సర్కిళ్లలో 63 జోన్లను ప్రకటించింది. వైద్యారోగ్యశాఖ ప్రకటించిన హెల్త్ బులిటెన్లో మాత్రం 70 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో కేసుల సంఖ్యతోపాటు తీవ్రతను బట్టి కంటైన్మెంట్ జోన్లను ప్రకటించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి నిబంధనలు ఉంటాయనేదానిపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ -మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 250 కేంద్రాల్లో రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. మరో 30 కేంద్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. బుధవారం చేసిన పరీక్షల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 989, మేడ్చల్ జిల్లాలో421, రంగారెడ్డి జిల్లాలో437 కలిపి మూడు జిల్లాల్లోనే 1,847 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఈ కేసులుజీహెచ్ఎంసీ పరిధిలోని పట్టణ ప్రాంతాలతోపాటు మేడ్చల్,రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్నాయి.
లెక్కల్లో గందరగోళం
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి కేసుల వివరాలను మాత్రమే క్షేత్రస్థాయిలోని అధికారులకు సమాచారమిస్తున్నారు. దీంతోపాటు గ్రేటర్లో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్ల వివరాలను జీహెచ్ఎంసీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రకటించిన లెక్కల్లో 63, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రకటించిన హెల్త్ బులిటెన్లో 70 మినీ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. పైగా క్షేత్రస్థాయిలో కంటైన్మెంట్ జోన్ల ఊసేలేదని అధికారులు చెబుతున్నారు. 5 కేసులకుపైగా వస్తే ఆ ఏరియాను మినీ కంటైన్మెంట్ జోన్, అపార్ట్మెంట్లో కేసులు ఉంటే హౌస్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అసలు మినీ కంటైన్మెంట్ జోన్లలో విధించిన నిబంధనలపై జీహెచ్ఎంసీ స్పష్టత ఇవ్వలేదు. రోజువారి తరహాలోనే శానిటేషన్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
2,375మందితో 202 బృందాలు
ప్రభుత్వం ప్రకటించిన మినీ కంటైన్మెంట్ జోన్లలో శానిటేషన్తోపాటు స్ప్రేయింగ్ చేయడానికి 2,375 మంది కార్మికులతో 202 బృందాలను ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చిన కేసుల వివరాల ఆధారంగా కొవిడ్ పాజిటివ్ నమోదైన ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు, కరోనా పరీక్షల కేంద్రాలు,ప్రభుత్వ,ప్రయివేటుఆస్పత్రులు,జనసంచారం ఎక్కువగా మార్కెట్లు, ప్రభుత్వ సంస్థలు, ఏటీఎం కేంద్రాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిల్లోనూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి జోన్కు 2వేల లీటర్ల సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం అందుబాటులో పెట్టారు. ప్రతి రోజూ 16 వేల ఇండ్లను కవర్ చేస్తున్నారు. వార్డు, సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయం వరకు ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు తెలిపారు.