Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 5న రాస్తారోకోలో పాల్గొనాలి
- గిరిజన సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27న జరిగే బంద్లో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గిరిజన సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయా సంఘాల జేఏసీ భేటీ అయింది. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీ జే పీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పోడు భూములను సాగు చేస్తున్న గిరిజన రైతుల పై ప్రభుత్వం దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం,వేసిన పంటలను సైతం జేసీబీలతో నాశనం చేయడం అన్యాయమన్నారు. పసిపిల్లలు,మహిళలని కూడా చూడకుండా హత్యా నేరం మోపడం దుర్మార్గమని విమర్శించారు. అటవీహక్కుల గుర్తింపుచట్టం 2006 ప్రకారం పోడు భూములకు హక్కులు కల్పించకుండా కాలయాపన చేయడానికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తండాల గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో గిరిజన సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంలో ఘోరంగా విఫలమైందని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు సన్న చిన్న కారు రైతులుగా ఉన్న గిరిజన రైతులకు ఉరితాళ్లుగా మారే ప్రమాదముందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సాధారణ ప్రజలు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ ,రాష్ట్ర కాంగ్రెస్ ఎస్టీసెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మ నాయక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీ రామ్ నాయక్. గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్. తెలుగుదేశం ఎస్టీ సెల్ సీనియర్ నాయకులు రాజు నాయక్. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శరత్ నాయక్. మైదాన ప్రాంత ఐటీడీిఎ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర నాయక్, సురేష్ నాయక్, టిప్స్ రాష్ట్ర అధ్యక్షులు వీరన్న తదితరులు మాట్లాడారు.