Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడం సరిగాదు
- కేసీఆర్ కనుసన్నల్లో స్పీకర్ పనిచేస్తున్నారు : రఘునందన్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నదనీ, బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడం సరిగాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్పీకర్ కావాలనే తమను బీఏసీకి ఆహ్వానించడం లేదని ఆరోపించారు. స్పీకర్ చైర్ అంటే తమకు గౌరవముందనీ, ఆయన తీరే సరిగా లేదని అన్నారు. ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే బీఏసీకి ఆహ్వానించవద్దనే నిబంధన ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీకి పిలవకపోవడంపై అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నల్లచొక్కాలతో నిరసన తెలుపుతామన్నారు. సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని, కొత్త విధానాలను అమలు చేస్తే.. టీడీపీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నప్పుడు భట్టి విక్రమార్కను బీఏసీకి ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. కొందరు కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ఎల్పీలో విలీనమయ్యారనీ, మిగిలిన వారు బీ టీమ్గా మారారని ఆరోపించారు. అసెంబ్లీని కేవలం ఐదు రోజులు నడిపిస్తామని బీఏసీలో నిర్ణయించడం బాధాకరమన్నారు.