Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను నిలదీసిన రైతులు
నవతెలంగాణ-హాజీపూర్
వరి సాగు వద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మెడపై కత్తి పెడుతున్నాయని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట్ రైతుసదస్సులో రైతులు అధికారులను నిలదీశారు. శుక్రవారం గుడిపేట్ రైతు వేదికలో మండల వ్యవసాధికారిణి రజిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుసదస్సులో జిల్లా వ్యవసాయాధికారి వీరయ్య, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ రాజేశ్వర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయాయని, ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయనని స్పష్టం చేయడంతో రైతులు వరి సాగు విస్తీర్ణం తగ్గించి ఇతర పంటలపై దృష్టి సారించాలని చెప్పడంతో రైతులు అభ్యంతరం తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు వరి సాగు వద్దంటే ఎలాగని నిలదీశారు. తాము ఎన్నో ఏండ్ల నుంచి వరి సాగు చేస్తున్నామని, వేలల్లో కౌలు చెల్లించి జనుము, జీలుగ, పెసర, జొన్న లాంటి పంటలు వేస్తే గిట్టుబాటు కాక నష్టపోవాల్సి వస్తుందన్నారు. గత ఏడాది నియంత్రిత సాగు పేరుతో ప్రభుత్వం సన్న రకాలు సాగు చేయమంటే చేశామని, కొనుగోలు చేయక నష్టపోయామని తెలిపారు.