Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- శాశ్వత పథకాలను ఆశించిన మహానుభావులు బైరు మల్లయ్య గౌడ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ - నార్కట్పల్లి
పేద బడుగు, బలహీన వర్గాల, పీడిత ప్రజల జీవన స్థితిగతుల మార్పు కోసం పని చేసిన వ్యక్తి బైరు మల్లయ్యగౌడ్ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలోని ఔరవాణిలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపకులు బైరు మల్లయ్యగౌడ్ మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. బైరు మల్లయ్యగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. పేద ప్రజల కోసం మల్లయ్య చేసిన పోరాటాలు, నమ్మిన సిద్ధాంతం, ఆయన ఆశయ సాధన కోసం పని చేయడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. నమ్మిన ఆశయం కోసం ఎర్రజెండా నీడలో పీడిత ప్రజల బాగు కోసం బైరు మల్లయ్య జీవితం కొనసాగిందన్నారు. ఆయన ఆశయ సాధనకనుగుణంగా కల్లుగీత కార్మికుల లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. గౌడ కులస్తులకు తాటి పన్ను రద్దు చేసి నీరా పానకాన్ని అమ్ముకునే హక్కును కేవలం గౌడ కులస్తులకే కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. సర్దార్ పాపన్నగౌడ్, బైరు మల్లయ్య గౌడ్, బొమ్మగాని ధర్మభిక్షం పోరాటయోధుల ఆశయ సాధన కోసం తాము పనిచేస్తున్నామన్నారు.సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరు మల్లయ్య గౌడ్ పాత్ర నేటి తరానికి ఆదర్శమన్నారు. గౌడ కుల వృత్తి కోసం అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. గౌడ కుల వృత్తిపై ఆనాటి ప్రభుత్వాల అన్యాయాలకు వ్యతిరేకం.. గీత కార్మికుల కోసం పోరాటం చేశారన్నారు.మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. బైరు మల్లయ్య గౌడ్ జీవితం పీడిత ప్రజల విముక్తి కోసం సాగిందని, నేటి యువత సెల్ ఫోన్ మోజులో పడకుండా చరిత్రలో మహానుభావుల గురించి అధ్యయనం చేయాలని కోరారు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బైరు మల్లయ్య గౌడ్ జీవితం ఈ ప్రాంత ప్రజలకు ఆదర్శమన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. బైరు మల్లయ్యగౌడ్ తెలంగాణ సాయుధ పోరాట యోధులుగా చరిత్రలో నిలిచిపోయారని, వారి చరిత్రను స్మరించుకునే విధంగా స్వగ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్గౌడ్, పలు సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పల్లె లక్ష్మణ్రావు, బాలగోని బాలరాజుగౌడ్, నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరిగౌడ్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామోజు వెంకటేశ్వర్లు, గ్రామ ఎంపీటీసీ శ్రీరామోజు జయలక్ష్మివెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ మాదిగోని అండాలునరసింహ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, జిట్ట నగేష్,, పుచ్చకాయల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.