Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి భూపాల్
- అమీన్పూర్ మండలంలో కార్మిక గర్జన పాదయాత్ర
నవతెలంగాణ - అమీన్పూర్
కార్మిక వర్గాల ఐక్యతతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. కనీస వేతనాల జీవోలను సవరించాలని, కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర శుక్రవారం బొల్లారం మండలం నుంచి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోకి ప్రవేశించింది. మొదటగా కిష్టారెడ్డిపేటలో పాదయాత్ర బృందానికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పాదయాత్ర బృందం కాసేపు ముచ్చటించింది. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, చాలీచాలని వేతనాలు తదితర వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం బీరంగుడా ఆలయ కమాన్ వద్ద సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, కార్మికులు, కార్యకర్తలు పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు ఎస్.వీరయ్య, భూపాల్, జయలక్ష్మి, పాలడుగు భాస్కర్ కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. 73వ షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లో కనీస వేతనాల జీవోలను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని డిమాండ్ చేశారు. 5 జీవోలను గెజిట్ చేయాలన్నారు.
కేంద్రం కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోకుండా పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కి, కార్మిక సంఘాల అభిప్రాయాలను బుట్టదాఖలు చేసి కార్మిక వ్యతిరేక కోడ్లను ప్రవేశపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఈ కోడ్ల వల్ల కార్మికులు బానిసలుగా మారి యాజమాన్యాలకు వెట్టిచాకిరి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న కార్మికులందరూ కనీస వేతనం పొందడం జీవించే హక్కులో భాగమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో బీడీ కార్మికుల జీవో అమలు చేయకుండా లక్షలాదిమంది కార్మికుల పొట్ట కొట్టారని గుర్తుచేశారు. ఈనెల 29న సంగారెడ్డిలో జరిగే పాదయాత్ర ముగింపు సభకు వేలాదిమంది కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మల్లికార్జున రావు, బీరం మల్లేశ్, నాయిని నర్సింహారెడ్డి, అతివేలు మాణిక్యం, పాండురంగారెడ్డి, అమీన్పూర్ నాయకులు, మున్సిపల్ సిబ్బందితో పాటు వివిధ పరిశ్రమల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.