Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ జేసికి జీవన్రెడ్డి, భట్టి కౌంటర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) కార్యాలయంలో కూర్చొని తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరైందికాదని ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఏదైనా వ్యాఖ్యలు చేయాలనుకుంటే బయట మాట్లాడాలని కోరారు. శుక్రవారం అసెంబ్లీ సీఎల్పీలో జేసీ కాసేపు కూర్చొన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై జేసీ స్పందిస్తూ అలా జగగాల్సి ఉండేది కాదనీ, అలా మాట్లాడటం తప్పేనని ఒప్పుకున్నారు. మరోసారి షోకాజ్ నోటీసులు వచ్చేలా మాట్లాడబోనని చెప్పారు. తాను పుట్టింది,పెరిగింది, అభివృద్ధి అయింది కాంగ్రెస్లోనేనన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఎప్పుడూ కలువలేదని, అందుకే ఆయన్ను ఇప్పుడు కలిశానని చెప్పారు. ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోయిందనీ, ఇప్పుడు ఎంపీగా నిలబడితే రూ 50 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
సీఎంతో జేసీ భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్తో జేసీ భేటీ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాను రాయలసీమను వదిలి తెలంగాణకు వచ్చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్ల ప్రకారం మద్యం షాపులు కేటాయించాలి : కాంగ్రెస్
రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపులు రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలని టీపీసీసీ సూచించింది. శుక్రవారం గాంధీభవన్లో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ అధికార ప్రతినిధి, బెల్లయ్యనాయక్, రాష్ట్ర నాయకులు బండి సుధాకర్ విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ అన్ని కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలనీ, అలా చేస్తే ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పాలకులు కండ్లు తెరిచేలా 27న జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు.