Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీలో నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశమైంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దీనికి ఎంపీ ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, టి జగ్గారెడ్డి, సీతక్క హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గైర్హాజరయ్యారు. దళితబంధు, ఆర్టీసీ, విద్యుత్చార్జీల పెంపు ప్రాతిపాదన, పోడుభూములు, ధరణి పోర్టల్ సమస్యలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
రేవంత్పై జగ్గారెడ్డి అసంతృప్తి
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి జహీరాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్టు తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే ఎలా అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గీతారెడ్డికి, తనకు కూడా ఎలాంటి సమాచారం లేదని విమర్శించారు. దీంతో తనకు, రేవంత్కు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా? అని నిలదీశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్గా ఉన్నా అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. తాను టీఆర్ఎస్లోకి పోవాలనుకుంటే అడ్డుకునేదెవరని ప్రశ్నించారు. సమావేశానంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను కూడా రెండు లక్షల మందితో సభ పెట్టగలననీ, రాష్ట్రంలో తనకూ అభిమానులు ఉన్నారని తెలిపారు. పార్టీలో మాట్లాడే అవకాశం దొరకడం లేదు కాబట్టి మీడియాతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి అభిమానులు సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. నా అభిమానులు కూడా అదేస్థాయిలో స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు.
రసమయి, జగ్గారెడ్డి మధ్య సరదా సంభాషణ
శాసనసభ ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలో జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి మధ్య సరదా సంభాషణ జరిగింది. రసమయి గొంతు మూగబోయిందని జగ్గారెడ్డి అని వ్యాఖ్యానించగా...సమాధానంగా.. అవసరాన్ని బట్టి తనప గొంతు బయటకు వస్తుందని రసమయి చెప్పారు. తన పాట తెలంగాణ అమరవీరులకు, త్యాగాల పునాదులకు అంకింతమని రసమయి ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.