Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
- 20రోజుల పాటు సమావేశాలు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీడియా పాయింట్ను అసెంబ్లీ ప్రాంగణంలోకి మార్చాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. శాసన మండలి సమావేశాల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని గన్పార్కులో విలేకర్లతో మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పట్టిందనీ, దాంతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అయితే కోవిడ్ సాకుతో మీడియా పాయింట్ ను బజార్లో పడేయటం సరికాదని విమర్శించారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ, ఉపాధ్యాయుల సర్దుబాటు ఇంకా జరగలేదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందన్నారు. కానీ.. ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో సరిపోను ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. సర్దుబాటు ఎప్పుడు చేస్తారో స్పష్టతలేదని తెలిపారు. గతంలో ఖాళీపోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లను, అవర్లీబేస్డ్ టీచర్లను, విద్యావాలంటీర్లను నియమించేవారని గుర్తు చేశారు. ఆపద్దతిలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులను నియమిం చాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి స్థాయిలోనే విద్యాశాఖ నిర్ణయాలు జరగాలని ఆయన అన్నారు. ప్రతి అంశం సీఎం దగ్గరకు పోవడంతో విద్యాశాఖ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతోందని విమర్శించారు. పాఠశాలల్లో ఇప్పటి వరకు పారిశుద్య సిబ్బందిని నియమించలేదన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యో గులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్దతుల్లో పనిచేస్తున్న 9,27,000 మందికి పీఆర్సీ వర్తింపచేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు సమగ్ర శిక్షలోనూ, హెల్త్మిషన్లోనూ పనిచేస్తున్న 50వేల మందికి కొత్త పీఆర్సీ వర్తింపచేయలేదని వివరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇవే అంశాలపై ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.