Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టేబుల్పైకి పలు బిల్లులు.. పద్దులు
- శాసనసభ సమావేశాలు ప్రారంభం
- సోమవారానికి సభ వాయిదా
- అక్టోబర్ 5 వరకు కొనసాగింపు
- బీఏసీలో నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతా పాన్ని ప్రకటించారు. మాజీ శాసనసభ్యులు కుంజా బొజ్జి, కుంజా భిక్షం, అజ్మీరాచందూలాల్, మేనేని సత్యనారాయణరావు, కేతిరి సాయిరెడ్డి, మాచర్ల జగన్నాథం, రాజయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్య ఇటీవల కాలంలో అనారోగ్య కారణాలతో మరణించారు. వారి మృతికి శాసనసభ ప్రగాఢ సంతాపం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అనంతరం శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. పలు బిల్లులు, పద్దులు టేబుల్పైకి వచ్చాయి. ఇదిలా వుండగా బడ్టెట్ సమావేశాల తర్వాత ఆరునెలలకు అసెంబ్లీ కొలువుదీరింది.
8 రోజులే అసెంబ్లీ సమావేశాలు : శాసనసభ సమావేశాలు 8 రోజులు జరగనున్నాయి. అక్టోబర్ 5న అవి ముగియనున్నాయి. మధ్యలో నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. ఈమేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో సీఎం కేసీఆర్, సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత అక్బరుద్దీన్, చీఫ్విప్, విప్లు హాజరయ్యారు, బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి ఆహ్వానించలేదని సమాచారం. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని 20 రోజులపాటు సభను జరపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరినట్టు తెలిసింది. చర్చించాల్సిన పలు అంశాలను ఆయన బీఏసీ ముందుంచారు.
ప్రతిపక్షాలు కోరినన్నీ రోజులు సభ : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఐటీ, ఇండిస్టీ, హరితహారం,వ్యవసాయం వంటి అంశాలపై చర్చించాలని ప్రతిపాదించారు. చర్చకొచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు సభను నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందనీ, జీరో అవర్లో సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. బిల్లులపై చర్చించడానికి వీలుగా సభ్యులకు ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ విపక్షాలకు సమయం ఎక్కువగా కేటాయిస్తున్నట్టు బీఏసీలో తెలిపారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ అసెంబ్లీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చేరవేయాలని సభ్యులకు సూచించారు.