Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని సర్కారు ఆదేశం
- మొత్తం ఫీజు కట్టాలని కార్పొరేట్ల స్కూళ్ల వేధింపులు
- చెల్లిస్తేనే తర్వాత తరగతికి ప్రమోట్ అంటున్న యాజమాన్యాలు
- అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు
- ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోని వైనం
- ప్రభుత్వమే చొరవ తీసుకుని.. గతేడాది ఫీజులు మాఫీ చేయించాలని డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశ.. థర్ట్వేవ్ హెచ్చరికల నడుమ ప్రభుత్వం విద్యాసంస్థల రీ ఓపెనింగ్కు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సెప్టెంబర్ ఫస్టు నుంచి ప్రభుత్వ, ప్రయివేట్ స్కూల్స్లో, కాలేజీల్లో ప్రత్యక్ష, పరోక్ష తరగతులు నడుస్తున్నాయి. ఇదే సమంయలో పెద్ద ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజు వేధింపులను తీవ్రతరం చేశాయి. కరోనా కాలంలో ఫీజులపై సర్కారు క్లారిటీ ఇవ్వకపోవడంతో కార్పొరేట్, ప్రయివేటు యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని గతంలో ఇచ్చిన జీవో 46కు కొనసాగింపుగా జీవో 75ను ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవోలో స్పష్టమైన వివరాలు పొందుపర్చలేదు. ముఖ్యంగా ఏ తరగతికి ఎంత వసూలు చేయాలని నిర్దిష్టంగా ఫీజు నిర్ణయించకపోవడంతో ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు దీనిని తమకు అనువుగా మార్చుకున్నాయి. ఫలితంగా గత విద్యాసంవత్సరం ఆన్లైన్ తరగతులకు హాజరు కాకున్నా.. వారిని తర్వాత క్లాసులకు ప్రమోట్ చేసిన కారణంగా ఫీజు చెల్లించాలని బెదింపులకు గురిచేస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాయి. లేకుంటే ప్రమోట్ చేయడం కుదరదని, ఫీజు మొత్తం చెల్లించాలంటున్నాయి. అంతేగాక సదరు కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రత్యక్ష, పరోక్ష తరగతులతో సంబంధం లేకుండా ఎప్పటి మాదిరిగానే ఏడాదికి లెక్కగట్టి మరీ వందశాతం ఫీజును వసూలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా.. చూసీచూడనట్టు ఉంటున్నారని తెలుస్తోంది. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది. ట్యూషన్ ఫీజుల విషయంలో అసలు ప్రభుత్వం వద్దే స్పష్టత లేదని అధికారులు అంటున్నారు. దీంతో కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులనూ కలిపి ట్యూషన్ ఫీజు కింద వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి క్లాసుల వారీగా ఎంత ఫీజు వసూలు చేయాలో చెప్పాల్సిన అవసరముందని అధికారులు అంటున్నారు. అప్పుడు అయితేనే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అప్పటిదాకా తామేమి చేయలేమని అంటున్నారు. గత విద్యాసంవత్సరం ఫీజులను మాఫీ చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ట్యూషన్ ఫీజును నిర్ణయించి క్షేత్రస్థాయిలో సర్కారు ఆదేశాలు అమలయ్యేలా అధికారులను ఆదేశించాలని, పకడ్బందీగా విధానాలు రూపొందించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
క్లాసుల వారీగా ఫీజులపై సర్కారు డిక్లరేషన్ ఇవ్వాలి ఎండీ జావిద్, ఎస్ఎఫ్ఐ, నగర కార్యదర్శి
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని గతంలో జీవో 46, కొత్తగా 75జీవోను జారీ చేసింది. కానీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో సదరు జీవో ఎక్కడ సరిగా అమలు కావడం లేదు. ప్రభుత్వ స్పందించి పాత ఫీజుల రద్దు చేసి.. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి క్లాసుల వారీగా ఎంత ఫీజు వసూలు చేయాలో విద్యాసంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి
సర్కార్ ఆదేశాలు కాగితాలకే పరిమితం కందుకూరి గణేష్, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు, పీడీఎస్యూ
కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని గవర్నమెంట్ తెచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమైనవి తప్ప.. ఆచరణలో అమలు కావడం లేదు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యార్థుల ఫిర్యాదులతో కొన్ని కాలేజీలకు వెళ్లినప్పుడు మేనేజేమెంట్ల తీరు దారుణం. సర్టిఫికెట్లకు ఫీజులతో లింక్ పెట్టి పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నారు. అసలే కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల వ్యవహారం మరింత భారంగా మారింది. ఇకనైనా పాత ఫీజులను రద్దు చేసేలా చర్యలు తీసుకుని.. ట్యూషన్ ఫీజుల విషయంలో సర్కారు స్పష్టతనివ్వాలి.
స్కూళ్లు, కాలేజీల్లో అధికారిక తనిఖీలు లేవు..: కె. ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ సిటీ కార్యదర్శి, బీజేవైఎం
పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వాటిల్లో మౌలిక సౌకర్యాలు, ఫీజుల అంశంపై ఎక్కడా అధికారిక తనిఖీలు చేపట్టడం లేదు. కనీసం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు. పకడ్బందీగా జీవో అమలయ్యేలా చూడాలి. ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలి. తద్వారా ఫీజుల విషయంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కల్పించినట్టవుతుంది.
పాత, కొత్త ఫీజులను ప్రభుత్వం మాఫీ చేయాలి : అల్ఇండియా సేవ్ ఎడ్యూకేషన్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.తేజ
కరోనా కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆదాయవ్యయాల్లో మార్పులొచ్చాయి. ఇప్పటికీ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. మరోవైపు కరోనా థర్ట్వేవ్ అంటూ వైద్యశాఖ హెచ్చరిస్తోంది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో పాత, కొత్త ఫీజులను ప్రభుత్వం మాఫీ చేసి.. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. ట్యూషన్ ఫీజుల విషయంలో సర్కారు స్పష్టతనిస్తూ.. విద్యాసంస్థలు అవి ఫీజులు అనుసరించేలా చర్యలు తీసుకోవాలి.