Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం పరీక్షల టైంటేబుల్ను విడుదల చేశారు. అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. నవంబర్ 2 వరకు నిర్వహిస్తామని వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను విద్యార్థులు ఇప్పటికే హోం అసైన్మెంట్ రూపంలో ఏప్రిల్లో సమర్పించారని గుర్తు చేశారు. ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఒకేషనల్ కోర్సుల టైంటేబుల్, ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపారు. కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలు లేకుండానే ఫస్టియర్ విద్యార్థులను ఇంటర్ సెకండియర్కు ప్రమోట్ చేసింది. దీంతో ఆ విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. 4.59.008 మంది విద్యార్థులు గతంలోనే ఫస్టియర్ పరీక్షల ఫీజును చెల్లించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించామని అధికారులు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు విద్యార్థులకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందుకే నెలరోజుల ముందు టైంటేబుల్ ప్రకటించామని తెలిపారు. 70 శాతం సిలబస్తోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ పూర్తయిన సిబ్బందితోనే పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తామని వివరించారు. పరీక్షా కేంద్రాలను, బెంచీలు, డ్యూయల్ డెస్క్లు, తరగతి గది తలుపులు, కిటికీలను శానిటైజేషన్ చేస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామనీ, విద్యార్థుల ఉష్ణోగ్రతను పరిశీలిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది మాస్క్లు ధరించడం తప్పనిసరి అని ప్రకటించారు. కరోనా లక్షణాలుండే విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రంలో ఒకటి లేదా రెండు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఏఎన్ఎం/స్టాఫ్ నర్సు పరీక్షలు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులు భౌతికదూరం పాటించాలని సూచించారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల టైంటేబుల్
(ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు)
తేదీ మొదటి సంవత్సరం
25.10.2021 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
(సోమవారం)
26.10.2021 ఇంగ్లీష్ పేపర్-1
(మంగళవారం)
27.10.2021 మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ,
(బుధవారం) బాటనీ పేపర్-1,
పొలిటికల్ సైన్స్ పేపర్-1,
28.10.2021 మ్యాథమెటిక్స్ పేపర్-1బి
(గురువారం) జువాలజీ పేపర్-1
హిస్టరీ పేపర్-1
29.10.2021 ఫిజిక్స్ పేపర్-1
(శుక్రవారం) ఎకనామిక్స్ పేపర్-1
30.10.2021 కెమిస్ట్రీ పేపర్-1
(శనివారం) కామర్స్ పేపర్-1
01.11.2021 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1
(సోమవారం) బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
(బైపీసీ విద్యార్థులకు)
02.11.2021 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1
(మంగళవారం) జాగ్రఫీ పేపర్-1