Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రంట్లైన్ వారియర్లు అని పొగిడితే సరిపోదు
- బతికేందుకు కనీస వేతనాలివ్వాలి : స్కీం వర్కర్ల సమ్మెలో కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించా లని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారికి గౌరవ వేతనాల స్థానంలో కనీస వేతనాలి వ్వాలనీ, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. గతంలో మాదిరిగానే పోరాటాల ద్వారానే స్కీం వర్కర్లు హక్కులను సాధించుకోగలుగుతారన్నారు. వారి పోరాటాలను అణచివేయాలని చూసిన ప్రభుత్వాల ప్రయత్నాలు ఫలించలేదని వివరించారు. స్కీం వర్కర్ల అఖిల భారత సమ్మె నేపథ్యంలో సభను హైదరాబాద్లోని సుందరయ్య పార్కు వద్ద శుక్రవారం నిర్వహించారు. అధ్యక్ష వర్గంగా ఆర్వాణి(సీఐటీయూ), ప్రేమపావని(ఏఐటీయూసీ), ఎస్ఎల్ పద్మ(ఐఎఫ్టీయూ), వెంకటేశ్(సీఐటీయూ), నర్సింహ్మ(ఏఐటీయూసీ) వ్యవహరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ..స్కీం వర్కర్లకు కనీసం వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడి చనిపోయిన స్కీం వర్కర్ల కుటుంబాలకు రూ.50 లక్షల రూపాయలివ్వాలని కోరారు. కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోతలు పెట్టడం సరిగాదన్నారు. స్కీం వర్కర్ల సేవల గురించి చప్పట్లు కొట్టించి, కీర్తిస్తే సరిపోదనీ వారు కనీసం బతికే సౌకర్యాలు పొందేలా చూడాలన్నారు. గౌరవవేతనం అని ముద్దుపేరుపెట్టి స్కీం వర్కర్ల శ్రమను పాలకులు దోచుకుంటున్నదని విమర్శించారు. మోడీ సర్కారు స్కీం వర్కర్లనే కాదు రైతులను, కార్మికులను కూడా విస్మరించిందనీ, కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని వివరించారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యపోరాటాలే మార్గమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ మాట్లాడుతూ..ఓవైపు పిల్లలకు పౌష్టికాహారం అందించాలంటూనే మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు తొలగించాలని చూడటం దారుణమని విమర్శించారు. మతం చుట్టూ రాజకీయాలను తిప్పడం మానేయాలని సూచించారు. ఏ మతమైనా మానవత్వం గుర్తించి ఆలోచిస్తున్నదనీ, మోడీ మాత్రం దాన్ని మరిచారని విమర్శించారు. స్కీం వర్కర్లను ఫ్రంట్లైన్ వారియర్లు అని పొగిడితే సరిపోదనీ, పొగడ్తలు కడుపు నింపవని అన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ.. గౌరవ వేతనం మీద కాకుండా కనీస వేతనం మీద పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చే గౌరవవేతనమూ ఆటో, బస్సు కిరాయిలకే పోతున్నదనీ, పర్మినెంట్ అవుతుందనే చిన్న ఆశతోనే స్కీం వర్కర్లు బతుకులను నెట్టుకొస్తున్నారన్నారు. మంచివేతనం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బతుకుమ్మ చీరలెందుకు? పథకాలెందుకు? అని ప్రశ్నించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్ మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలో ఆశావర్కర్లు ముందువరుసలో ఉండి సేవలందించారనీ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపారు. వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ పథకాల ప్రయివేటీకరణ అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్కే బోస్ మాట్లాడుతూ..స్కీం వర్కర్ల సమ్మె వారి ఆకలిపోరాటానికి నాంది అన్నారు. 15,20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. వారికి కార్మిక చట్టాలను వర్తింపజేయాలన్నారు. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిన నేపథ్యంలో గౌరవ వేతనాలు ఎక్కడ సరిపోతాయని ప్రశ్నించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు శివబాబు మాట్లాడుతూ..నరేంద్రమోడీ, కేసీఆర్ స్కీం వర్కర్ల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. కనీస వేతనాల కోసం రోడ్లెక్కవద్దని చెప్పటం సరిగాదన్నారు. పోరాటాల ద్వారానే వేతనాలు పెరుగుతాయన్నారు.
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్ మాట్లాడుతూ..అధికారం ఉన్నా, లేకున్నా హక్కుల కోసం పోరాడేది కార్మిక సంఘాలేనన్నారు. అధికారులు దుర్మార్గంగా సమ్మెను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ స్పెషల్ క్యాంపు పెట్టడం దారుణమన్నారు. 15 రోజులు ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం సరిగాదన్నారు. స్కీం వర్కర్లతో బండెడు చాకిరీ చేయించుకునీ, అధికారాలు మాత్రం రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పెంచుకునేందుకు, వేల కోట్లతో కట్టే ప్రాజెక్టులకు నిధులుంటాయిగానీ, స్కీం వర్కర్లకు జీతాలు పెంచేందుకు మాత్రం చేతులు ముందుకు రావడం లేదని విమర్శించారు.
ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబూ రావు మాట్లాడుతూ..ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను పాలకులు అనుసరిస్తున్నారని విమర్శించారు. కులమతాలకు అతీతంగా ప్రజల్ని ఐక్య పోరాటాల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. టీఎమ్ఎస్ఆర్యూ సంయుక్త కార్యదర్శి...ఎ.నాగేశ్వర్రావు మాట్లాడుతూ..స్కీం వర్కర్లు చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమైనదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా, కార్మికులుగా గుర్తిస్తే అందరితో సమానంగా వేతనాలు, పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటివి ఇవ్వాల్సిన వస్తుందనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని విమర్శించారు.