Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్న మోడీ ప్రభుత్వం
- మహిళలపై లైంగిక దాడులను నివారించడంలో ప్రభుత్వాలు విఫలం : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
- సూర్యాపేటలో ప్రారంభమైన ఐద్వా రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 10 నెలలుగా వేలాది మంది రైతులు చేస్తున్న పోరాటమే మహిళా లోకానికి స్ఫూర్తి కావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే అన్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఐద్వా రాష్ట్ర 3వ మహాసభ ప్రారంభం సందర్భంగా శుక్రవారం గాంధీపార్కులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తం గా మహిళల సమస్యలపై పోరాటం చేసేందుకు ఐక్యంగా ముం దుకు కదలాల్సిన సమయం ఆసన్నమైంద న్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న మోడీ ప్రభుత్వం కార్పొరేటీకరణకు బీజం వేస్తుందని తెలిపారు. మోడీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా తయారైం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేండ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిం చారు. పేదలందరికీ ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గొప్పగా ప్రచారం చేసిన మోడీ.. రోజురోజుకూ గ్యాస్ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. గ్యాస్ సబ్సిడీని రూ.22 వేల కోట్ల నుంచి రూ.3వేల కోట్లకు కుదించడం దుర్మార్గమైన చర్య అన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో కేవలం నినాదంగానే మిగిలి పోయిందే తప్ప బాలబాలికలకు ఒరిగిందేమీ లేదన్నారు. కరోనా వల్ల పేదలు తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదని, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాక దేశంలోని అనేక ప్రాంతాల్లో బాలబాలికలపై హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. వాటిని నివారించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ధరల అదుపులో ప్రభుత్వాలు విఫలం :మల్లు లక్ష్మి
నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై అనేక రూపాల్లో భారాలు పడుతున్నాయని అన్నారు. రూ.3వేల కోట్ల పొదుపు సొమ్మును మహిళా సంఘాలకు విడుదల చేస్తానని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటివరకు వేయలేదన్నారు. రాష్ట్రంలో పాద యాత్ర చేస్తున్న బండి సంజరు.. ఆడపిల్లల రక్షణ, మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ యాత్ర చేస్తే బాగుంటుందని సూచించారు.
5000 మందితో సూర్యాపేటలో భారీ ప్రదర్శన
బహిరంగ సభకు ముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన బాలాజీ రైస్ మిల్లు నుంచి ప్రారంభమై కొత్త బస్టాండ్ మీదుగా పూలే విగ్రహం, శంకర్ విలాస్ సెంటర్, పాత వ్యవసాయ మార్కెట్, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా గాంధీ పార్క్ వరకూ సాగింది. ఈ సందర్భంగా మహిళల కోలాటం, నృత్యాలు అందర్నీ అలరించాయి.