Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గన్పార్క్ మీడియా పాయింట్ వద్దా ఆంక్షలు
- అసెంబ్లీ సమావేశాల తొలిరోజే స్పష్టం చేసిన ప్రభుత్వం
- సంతాప తీర్మానాలు..
- 27కి వాయిదా.. ఏడురోజులే సభ
- ఢిల్లీ వెళ్లిన సీఎం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అసెంబ్లీలో అధికారపార్టీ వ్యవహారశైలిలో మార్పు కనిపించలేదు. గతంలో మాదిరే ఇప్పుడూ ప్రతిపక్షాలను కట్టడి చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రజాస్వామ్యం పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడాన్ని సహించేది లేదని ప్రత్యక్షంగానే చెప్పేసింది. కోవిడ్ నిబంధనల పేరుతో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ను ప్రభుత్వం ఎత్తేసిన విషయం తెలిసిందే. దీనితో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్లో మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అక్కడికొచ్చి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈవేదికను ఉపయోగించుకోవాలనేది మీడియా ప్రతినిధుల ప్రధాన ఉద్దేశ్యం. ఇది గమనించిన ప్రభుత్వం అక్కడ కూడా ఆంక్షలు విధించింది. ఎలక్ట్రానిక్ మీడియా వాహనాలను తీసేయాలనీ, లేకుంటే తామే పోలీస్ కంట్రోల్ రూమ్కు తరలిస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు పార్కు ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను సోమవారానికి వాయిదా వేశారు. ఆ తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో సభను అక్టోబర్ 5వ తేదీ వరకు నడపాలని నిర్ణయించారు.
పరిస్థితులను బట్టి ఆతేదీనీ పొడిగించు కోవచ్చని ప్రభుత్వం చెప్పింది. శనివారం సభ ప్రారంభమైతే మధ్యలో నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి. తొలిరోజు సంతాప తీర్మానాలతో వాయిదా పడిన సభ, ఆ తర్వాత వారం రోజులు మాత్రమే సమావేశం కానుంది. గత శాసనసభా సమావేశాలకు ఇప్పటి సమావేశాలకూ మధ్య కాలంలో మారిన రాజకీయ సమీ కరణాలు, ప్రజా సమస్యలు, చర్చనీయాంశ ఘటనల నేపథ్యంలో సభ నిర్వహణ ఆసక్తికరంగా మారింది. శాసనసభ తిరిగి ప్రారంభమయ్యే సెప్టెంబర్ 27న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిపక్షపార్టీలు భారత్బంద్కు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుసరించాల్సి వ్యూహంపై ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తున్నది. ఆరోజు సభలో ప్రతి పక్షాలు ప్రశ్నలు, విమర్శలు చేస్తే బీజేపీ తమకు అండగా నిలుస్తుందని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. శాసనమండలిలో కూడా ప్రతిపక్ష సభ్యులను కట్టడి చేస్తే చాలనే ధోరణిలో ఉంది. మరోవైపు శాసనసభలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
ఆయన కాం గ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్కతో చర్చించారు. సభలో లేవనెత్తా ల్సిన అంశాలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సంఘటనలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా రేవంత్రెడ్డి భట్టికి ఇచ్చినట్టు సమాచారం. మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం చెప్తూ తీర్మానాలు ప్రవేశపెట్టాక సభ వాయిదా పడింది. ఆ వెంటనే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిపోయారు. ఈనెల 1న ఢిల్లీ వెళ్లి 9వ తేదీ హైదరాబాద్ తిరిగొచ్చిన ఆయన రెండు వారాల్లోనే మళ్లీ విమానం ఎక్కడం చర్చనీయాంశమవుతున్నది. అధికారిక కార్యక్రమాలు ఉన్నా, వాటికంటే బలమైన వ్యక్తిగత కారణాలు కూడా వెంటాడుతున్నాయనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.