Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియాకు రూ.412.66కోట్ల ఆదాయం
నవతెలంగాణ- సిటీబ్యూరో
భవన నిర్మాణ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) విజయవంతంగా అమలవుతోంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 2015లో టీఎస్-ఐపాస్ ప్రవేశపెట్టిన సర్కార్.. అదే తరహాలో తెలంగాణ మున్సిపల్ చట్టం-2019కు లోబడి టీఎస్బీ పాస్ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. అందులో భాగంగానే టీఎస్బీపాస్ ప్రవేశపెట్టిన 2020 నవంబర్ నుంచి గురువారం వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 7,766 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా జీహెచ్ఎంసీకి రూ.412.66కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే రూ.158కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.
ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్, ఇన్స్టాంట్ అప్రూవల్
75చదరపు గజాల ప్లాట్కు ఎలాంటి భవన నిర్మాణ అనుమతి అక్కర్లేదు. ఒక్క రూపాయితో రిజిష్ట్రర్ చేసుకుంటే సరిపోతుంది. రెసిడెన్షియల్ అయితే గ్రౌండ్తోపాటు జీ+1 వరకు నిర్మించుకోవడానికి అవకాశముంది. అయితే ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ మాత్రం తీసుకోవాల్సిందే. 500చదరపు మీటర్ల వరకు రెసిడెన్షియల్ కేటగిరిలో 10మీటర్ల ఎత్తు వరకు ఆన్లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఇన్స్టాంట్ అప్రూవల్ వస్తోంది. ఈ కేటగిరిలో 6,439దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4071 దరఖాస్తులను జీహెచ్ఎంసీ ఆమోదించింది. మరో 945 దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయి. 1423 దరఖాస్తులను మాత్రం తిరస్కరించారు.
రోడ్డు వెడల్పు, లింకు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయకపోవడంతోనే తిరస్కరణకు గురవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
సింగిల్ విండ్కు 1327 దరఖాస్తులు
ప్లాట్ సైజు 500 చదరపు మీటర్లకుపైగా, 10మీటర్లకుపైగా ఎత్తు కల్గిన రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ భవనాలకు సంబంధించిన దరఖాస్తులను సింగిల్ విండో ద్వారా ఆమోదిస్తున్నారు. ఈ దరఖాస్తులను జీహెచ్ఎంసీతోపాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖ, అగ్నిమాపక శాఖలు పరిశీలించి నిరభ్యంతర సర్టిఫికెట్(ఎన్ఓసీ) జారీ చేస్తాయి. వీటన్నింటిని పరిశీలించిన తర్వాతే నిర్మాణ అనుమతులను మంజూరు చేస్తున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి 1327 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 501 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. మరో 449 దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయి.
సర్టిఫికెట్ ఇచ్చాకే నిర్మాణం : జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్రెడ్డి
జీహెచ్ఎంసీ నుంచి అనుమతి సర్టిఫికెట్ వచ్చాకే నిర్మాణ పనులు ప్రారంభించాలని చీఫ్సిటీ ప్లానర్(సీసీపీ) ఎస్.దేవేందర్రెడ్డి తెలిపారు. ఇన్స్టాంట్ అప్రూవల్కు ముందుగానే అన్ని వివరాలను చెక్ చేసుకోవాలని, తప్పుడు వివరాలు అప్లోడ్ చేస్తే అనుమతిరాదని తెలిపారు. ఒక వేళ అనుమతి రాకముందే నిర్మాణ పనులు చేపడితే కూల్చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. సింగిల్విండో విధానంతో తొందరగా అనుమతులు వస్తున్నాయని, దీంతో బిల్డర్లకు వెసులుబాటు కలిగే అవకాశముందన్నారు.