Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పు ఎగ్గొట్టిన వారి పేర్లు ప్రకటించాలి
- ఎస్వీకే వెబినార్లో బెఫీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రామయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే బ్యాడ్ బ్యాంక్తోనూ కార్పొరేట్లు, కార్పొరేట్ సంస్థలు, అధికార పార్టీకే లాభం కలుగుతుందని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకట్రామయ్య చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దేశానికి, ప్రభుత్వరంగ బ్యాంకులకు, ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో 'బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణాలు-పర్యవసానాలు'అనే అంశంపై శనివారం వెబినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వారి నుంచి రుణాలను తిరిగి వసూలు చేసేందుకు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. ఆ బ్యాంకుకు రూ.30,600 కోట్లు కేంద్రం గ్యారెంటీ ఇచ్చిందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్బీఐ, ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో రూ.8.40 లక్షల కోట్ల అప్పులు మొండి బకాయిలున్నాయని వివరించారు. ఇందులో 79 శాతం కార్పొరేట్ సంస్థలకు చెందినవే ఉన్నాయని చెప్పారు. రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో మొండి బకాయిలున్న వ్యక్తులు, సంస్థల నుంచి తొలుత వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్న మొండి బకాయిల నుంచి రూ.2 లక్షల కోట్లు బ్యాడ్ బ్యాంక్కు బదిలీ అవుతాయని వివరించారు. ఐదేండ్ల తర్వాత బ్యాడ్ బ్యాంక్ అవసరం ఉండబోదనీ, మొండి బకాయిలుండబోవని ఆర్థిక మంత్రి ప్రకటించారని చెప్పారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.15 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారని వివరించారు. ఇలాంటి వాస్తవాలున్న ప్రత్యేక ఎజెండాతో బ్యాడ్బ్యాంక్ను కేంద్ర ప్రభుత్వం తెస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వారి పేర్లను బహిరంగంగా ప్రకటించాలనీ, వారి సంస్థలను విక్రయించడంతోపాటు వ్యక్తిగత ఆస్తులనూ స్వాధీనం చేసుకునేందుకు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనీ, పాస్పోర్టును సీజ్ చేయాలని కోరారు. ఇలాంటి చట్టాలు తేవాలనీ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.