Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడుసాగుదారులకు అండగా ఉంటాం
- పోడు రైతుల పొలికేక సదస్సులో తమ్మినేని
- కేసీఆర్ మెడలు వంచి పట్టాలు సాధిస్తాం: చాడ
నవతెలంగాణ-కొణిజర్ల
వామపక్షాల పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన అటవీహక్కుల చట్టాన్ని ధిక్కరించే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి లేదని, పోడుసాగుదారులకు అండగా ఉంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన పోడురైతుల పోలికేక సదస్సులో ఆయన మాట్లాడారు. అడవిని కాపాడేది మూమ్మాటికీ గిరిజనులేనని, అడవులను ధ్వంసం చేసేది పాలకవర్గాలు మాత్రమే అన్నారు. అడవినుంచి గిరిజనులను వెళ్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. 2006 హక్కుల చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల స్ఫూర్తితో పోడుభూముల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 5వ తేదీన అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడుభూముల సమస్యలపై తలపెట్టిన రాస్తారోకోను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పోడు రైతులకు వామపక్షాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయన్నారు. పోడుభూములను సర్వే చేసి హక్కులు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హడావుడిగా పోడుభూములపై సబ్ కమిటీ వేస్తే కుదరదన్నారు. హక్కుపత్రాలు ఇచ్చే వరకు పోరాడతామని హెచ్చరించారు. కేసీఆర్ పరిపాలన.. నైజాం రజాకార్ల పరిపాలన కంటే దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ మెడలు వంచి పోడుభూములకు పట్టాలు సాధించుకుంటామ న్నారు.న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. హరితహారం పేరుతో పోడుభూములు గుంజుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. చంటిపిల్లల తల్లులను జైల్లో పెట్టిన దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఫారెస్టు అధికారులు, పోలీసులు, ప్రభుత్వం కలిసి పోడుసాగుదారులపై దౌర్జన్యంగా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పీడీ యాక్టు లాంటి కేసులు నమోదు చేసి ఆమాయక గిరిజన ప్రజలను జైలుకి పంపండం సిగ్గుచేటున్నారు. ఎల్లన్ననగర్లో పోడుసాగుదారులను జైల్లో పెట్టినా చూసేందుకు రాని వైరా ఎమ్మెల్యే ఉన్నా ఒక్కటే.. లేకపోయినా ఒక్కటేనని అన్నారు. పోలీసు స్టేషన్లు టీఆర్ఎస్ కార్యాలయాలుగా మారాయని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేశారని, పోడుభూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. కుర్చీలో కూర్చొని పోడుభూములకు పట్టాలు ఇస్తానని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకెప్పుడు పట్టాలు ఇస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ నోరుతెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడిన దాఖలాలు లేవని టీజేఎస్ రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్రావు అన్నారు.
అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్రావు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్, గోకినపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడారు. సదస్సులో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ, ఎన్డీ మండల కార్యదర్శి పి.అప్పారావు, కాంగ్రెస్ మండల అద్యక్షుడు వడ్డె నారాయణ, టీడీపీ మండాలధ్యక్షులు తాతా సుధాకర్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.