Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హింస, విశృంఖలత్వం నుంచి మహిళలకు విముక్తి కావాలి
- దేశంలో అంబానీలు, అదానీల పరిపాలన: ఐద్వా జాతీయ అధ్యక్షులు మాలిని భట్టాచార్య
- జెండాను ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం
- ప్రతినిధుల సభ ప్రారంభం
సూర్యాపేట (ఆనేగళ్ల అరుణానగర్) నుంచి బి.బసవపున్నయ్య
దేశంలో అంబానీలు, అదానీల పాలన కొనసాగుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షులు మాలిని భట్టాచార్య విమర్శించారు. మోడీ పరిపాలనలో ప్రజలు ప్రధానంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక లైంగిక వేధింపులు, దాడులు చోటుచేసు కుంటున్నాయని వ్యాఖ్యానించారు. రైతులు, రైతు మహిళలు, పౌరులు స్వాంత్య్ర సమరం ఫలాలు పొందలేని దుస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొందని వివరించారు. తెలంగాణకు గొప్ప పోరాట చరిత్ర ఉందనీ, స్వాతంత్య్రంలో అనేక మంది మహిళలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ బలిదా నాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపుని చ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో అనిగెల్ల అరుణానగర్లో ఐద్వా రాష్ట్ర మహాసభల ప్రతినిధుల సభలో మాలిని భట్టాచార్య ప్రారంభోపన్యాసం చేశారు. దీనికి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు కెఎన్ ఆశాలత, ఉపా ధ్యక్షులు బి హైమావతి, బుగ్గవీటి సరళ, బి. అనురాధ, ఎం. జ్యోతి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, కోశాధికారి ఎస్. పుణ్యవతి, జాతీయ నాయకులు శ్రీమతి, కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షులు పి. జ్యోతి వేదికపై ఆశీసులయ్యారు. ఈసందర్భంగా భట్టాచార్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తితో రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. అలాగే స్వాతంత్య్ర పోరాట సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో మానికొండ సూర్యావతి ఐద్వాను ముందుకు నడిపించారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా ఆ స్వాతం త్య్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తు న్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆ తర గతికి చెందిన మహిళలు స్థిరంగా నివసించే పరిస్థితి లేదని విమ ర్శించారు. దేశవ్యా ప్తంగా అన్ని తరగతుల ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించాలనీ, అప్పుడే నిజమైన స్వాతం త్య్రం వచ్చినట్టని అభిప్రాయపడ్డారు. హింస, విశృంఖలత్వం నుంచి విముక్తి పొందితేనే మహిళకు అసలైన స్వేచ్ఛ అని అన్నారు. లక్ష్మి సెహగల్,సుశీలా గోపాలన్, సూర్యవతి, మల్లు స్వరాజ్యం, గోదావరి పరులేకర్ తదితర మహిళలను ఆదర్శంగా తీసుకుని పోరాటాలు, ఉద్యమాల్లో పాల్గొనాలని సూచించారు. మాదక ద్రవ్యాల వంటి సామాజిక రుగ్మతలు సమాజానికి ప్రమాదకరంగా మారాయనీ, అవి మహిళల పట్ల శాపంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు దోచుకునే పనిలో ఉన్నారని చెప్పారు. మోడీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు నదీజలాలు, భూములను సైతం కార్పొరేట్లకు ఉచితంగా ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. అసోంలో ఇటీవల బీజేపీ ఎలా వ్యవహరించిందో మీడియాలో వచ్చిందని చెప్పారు. దేశంలో ఉన్నతవర్గాలు, ధనికులదే అధికారమనీ, బడుగు, బలహీనవర్గాల ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదని వివరించారు. మహిళలపై దౌర్జన్యాలు అధికమయ్యాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం బంద్ చేసిన ఘనత మోడీ సర్కారుదేనని విమర్శించారు. స్కూళ్లను మూసేస్తూ బాలికా విద్యను మరింత నిర్లక్ష్యం చేస్తున్నదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్లో మహిళల కోసం మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళలు, యువతులపై మనువాద సిద్ధాంతం రుద్దుతూ దాడికి పాల్పడుతున్నారని చెప్పారు. లవ్జిహాద్ పేరుతో కేంద్రం, పోలీసులు ప్రజలపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. హత్రాస్ సంఘటనే ఇందుకు సాక్ష్యమని వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడున్న మోడీ సర్కారు పనికిరానిదని చెప్పారు. మహిళలతోపాటు సాధారణ ప్రజలనూ బీజేపీ సర్కారు శత్రువులుగా పరిగణిస్తున్నదని తెలిపారు. అన్ని తరగతుల ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని గుర్తు చేశారు.
జెండాను ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఐద్వా ప్రతినిధుల సభ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. నడవలేని స్థితిలో ఉన్నా , ఉత్సాహంగా ఐద్వా మహాసభల ప్రాంగణానికి విచ్చేశారు. జెండా విష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తాను, కృష్ణమూర్తి దళాలను నిర్మించి ఉద్యమాలు చేశామన్నారు.బీమిరెడ్డి కూడా 50, 50 మందితో దళాలను ఏర్పాటు చేశారని వివరించారు. హైదరాబాద్ నైజామ్తో పోరాడామని గుర్తు చేశారు. మహిళలంతా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి భూస్వాములు అంబానీలు, అదానీలని గుర్తు చేశారు. పట్టణాల చుట్టూ ఉన్న భూములను ఆక్రమించారనీ, ఇప్పుడున్న సుద్దామన్న భూమి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ దిగిపో, దున్నేవాడిదే భూమి, విశాలాంధ్రలో ప్రజారాజ్యం రావాలి అంటూ మల్లు స్వరాజ్యం నినాదాలు ఇచ్చారు.
అమరవీరులకు నివాళులు
మహాసభల ప్రాంగణం అనెగెళ్ల అరుణానగర్ ఆవరణలో అమరవీరులకు నివాళులర్పించారు. ఐద్వా జాతీయ అధ్యక్షులు మాలిని భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే,కోశాధికారి ఎస్.పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షులు కెఎన్ ఆశాలత, కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షులు పి.జ్యోతి, బి.సరళ, హైమావతి తదితరులు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. రకరకాల కారణాలతో చనిపోయిన ఐద్వా వ్యవస్థాపకులు మైథిలి శివరామన్, కేరళ మాజీ మంత్రి గౌరీయమ్మ తదితరులకు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ్మ, ఐద్వా మహబూబ్నగర్ కార్యదర్శి ఎ.అరుణతోపాటు ఢిల్లీ రైతాంగ పోరాటం మరణించిన రైతులు, లైంగిక దాడుల సందర్భంగా చనిపోయిన పలువురు చిన్నారులకు ప్రతినిధుల సభ నివాళులు అర్పించింది. వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.
సూర్యాపేటలో ఐద్వా సభల హడావుడి
రాష్ట్రం నలుమూలల నుంచి ఐద్వా సభలకు హాజరైన మహిళలు, యువతులతో సూర్యాపేటలో హడావుడి నెలకొంది. పట్టణమంతా ఐద్వా తోరణాలు, జెండాలు, ప్లెక్సీలతో కళకళాడింది. వేలాదిమందితో శుక్రవారం జరిగిన ప్రదర్శన, బహిరంగసభ పట్టణంలో చర్చకు దారితీసింది.
కార్యదర్శి నివేదిక
గత కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను కార్యదర్శి మల్లు లక్ష్మి సమర్పించారు. మహాసభల రెండో రోజున సంతాప తీర్మానంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు-మహిళలపై ప్రభావాలు, మహిళలపై హింస తదితర తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటిని ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ప్రాంగణంలో మెడికల్ క్యాంపు
ఐద్వా మహాసభల ప్రాంగణంలో డాక్టర్ అరుణ్రెడ్డి, డాక్టర్ మనీషా, డాక్టర్ రోహిణితోపాటు డాక్టర్ ఎండీ జహీరుద్దీన్ ఆధ్వర్యంలో సభలకు వచ్చిన ప్రతినిధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.